Gujarat Exit Polls: గుజరాత్లో మోడీ హవా.. మళ్లీ అధికారం బీజేపీదే..! ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇదే..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. డిసెంబర్ 8న (గురువారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి.. మొదటి విడతలో 89 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. 93 స్థానాల్లో ఈ రోజు పోలింగ్ పూర్తయింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. డిసెంబర్ 8న (గురువారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి.. మొదటి విడతలో 89 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. 93 స్థానాల్లో ఈ రోజు పోలింగ్ పూర్తయింది. గుజరాత్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ వరుసగా ఏడోసారి అధికారం సొంతంచేసుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించడంతో.. బీజేపీ మరోసారి గుజరాత్ పీఠాన్ని కైవసం చేసుకోనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. గుజరాత్లో మోడీ హవానే కొనసాగిందని పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వెల్లడైంది. గుజరాత్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎప్పటిలాగే మోదీ హవా కొనసాగింది. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. గుజరాత్ లో బీజేపీకి 125-143, కాంగ్రెస్ 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7, ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
బీజేపీ భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని.. ఇన్ని సీట్లు రావడానికి మోదీ హవానే కారణమంటూ పీపుల్స్ పల్స్ పేర్కొంది. బిజెపి-కాంగ్రెస్ మధ్య ఓట్ల వ్యత్యాసం 21 శాతంగా ఉంటుందని పేర్కొంది. బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్ పార్టీకి 25 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 16 శాతం, ఇతరులకు 13 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ± 3 శాతంగా ఉంటుందని పేర్కొంది. 182 స్థానాలు ఉన్న గుజరాత్ శాసనసభలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 92 సీట్లు గెలవాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం అయినందున, ఎప్పటిలాగే ఆయన సెంటిమెంట్ బీజేపీకి లాభం చేకూర్చింది. ఈ సారి గుజరాత్ లో దాదాపు 30 బహిరంగ సభల్లో నరేంద్ర మోదీ పాల్గొనడం, వరసగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అమిత్ షా క్షేత్రస్థాయిలో ఉండి వ్యుహాలు రచించడం వల్ల గుజరాత్లో బీజేపీ తన పట్టు నిలుపుకోగలిగిందని పేర్కొంది.
ఆమ్ ఆద్మీ పార్టీ 16 శాతం ఓట్లు సాధించినా, సీట్లు సాధించడంలో విఫలమయ్యిందని పేర్కొంది.గుజరాత్ ఎన్నికల్లో ఓట్లు సాధించిన ఓట్ల శాతం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ షేర్ 3.1 శాతం తగ్గగా.. కాంగ్రెస్ ఓట్ షేర్ 16.4 శాతం తగ్గిందని తెలిపింది. 2017 రాహుల్ గాంధీ లాగా, ఈ సారి జాతీయ నాయకులు ఎవరూ గుజరాత్ ఎన్నికలపై ఫోకస్ పెట్టకపోవడమే కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గడానికి కారణమని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది. దళిత ఉద్యమ నాయకుడు జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్ లో చేరడం వల్ల ఆ పార్టీకి మేలు చేకూరినట్లు పేర్కొంది. మైనార్టీలు తప్ప దాదాపు అన్ని సామాజిక వర్గాలు బీజేపీ వైపే నిలబడ్డాయని వెల్లడించింది. హర్థిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్… పార్టీలో చేర్చుకోవడం వల్ల బీజేపీకి ప్లస్ అయ్యిందని పేర్కొంది.
నిత్యావసర వస్తువుల ధరలపెరుగుదల, నిరుద్యోగం, పంటలకు కనీస మద్దతు ధర, అభివృద్ధి, అవినీతి వంటివి గుజరాత్ లో ప్రధానమైన సమస్యలని, రైతులు, సామాన్యుల్లో బీజేపీపై అసంతృప్తితో ఉన్నా.. వారికి వేరే ప్రత్యామ్నాయ పార్టీ కనిపించకపోవడంతో మళ్లీ బీజేపీకే పట్టం కట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది. స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టినందుకే కాంగ్రెస్ కి ఈ మాత్రం సీట్లు వస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ కు 24 శాతం మంది, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 20 శాతం, హర్థిక్ పటేల్ కు 14 శాతం మంది, ఈ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపింది. గుజరాత్ లో పీపుల్స్పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ సర్వేను 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 240 పోలింగ్ స్టేషన్లలో నిర్వహించి, మొత్తం 4800 శాంపిల్స్ను సేకరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..