పులుల మృత్యుఘోష.. యమపాశంగా మారిన రైల్వే లైన్.. ఎన్ని చనిపోయాయంటే?
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మరోసారి విషాద ఘటన చోటుచేసుకుంది. బల్లార్షా- గోండియా రైలుమార్గంలో రాత్రి ఓ 14 ఏళ్ల పులిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తాజాగా పులి మరణంతో గడిచిన కొన్నేళ్లలో ఈ మార్గంలో జరిగిన రైలు ప్రమాదాల్లో మొత్తం 18 పులులు ప్రాణాలు కోల్పోయాయి. దీంతో ప్రభుత్వాలు ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి పులుల మరణాలను తగ్గేలా చర్యలు తీసుకోవాలని జంతుప్రేమికులు కోరుతున్నారు.

మహారాష్ట్ర: చంద్రపూర్ జిల్లాలో మరోసారి విషాద ఘటన చోటుచేసుకుంది. బల్లార్షా- గోండియా రైలుమార్గంలో రాత్రి ఓ 14 ఏళ్ల పులిని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. టీ- 40గా గుర్తింపు పొందిన ఈ మగ పులి..ప్రసిద్ధ పులి జయ సంతానంగా జన్మించింది. పర్యాటకులు ఈ పులిని బిట్టూ అనే ముద్దు పేరుతో పిలుచుకునేవారు. అయితే గత రాత్రి సిందేవాహి అటవీ ప్రాంతంలోని కాల్గాయ వద్ద గోండియా నుండి బల్లార్షాకు వెళ్తున్న మెమూ రైలు ఈ పులి ఢీకొట్టింది. దీంతో పులి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఉదయం మృతి మృతదేహాన్ని చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని చంద్రపూర్ పోస్టుమార్టం కేంద్రానికి తరలించారు.అనంతరం అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు అటవీ అధికారి అంజలి సాయంకర్, సహాయకుడు నితిన్ గడ్పాయలే, ఎన్టీసీఏ ప్రతినిధులు బండు ధోత్రే, ముకేశ్ భాందకర్, స్వాబ్ సంస్థ అధ్యక్షుడు కైరకర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పులిని రైలు ఢీకొట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే ఈ గోండియా-బల్లార్షా రైలుమార్గం దట్టమైన అటవీ ప్రాంతాల మధ్యగా సాగుతునట్టు గుర్తించారు. ఈ మార్గంలో ఎక్కడా అండర్పాస్ లేదా ఓవర్పాస్ వంటి వన్యప్రాణులకు రక్షణ కల్పించే వ్యవస్థలు లేవని గుర్తించారు. ఫలితంగా ఈ మార్గం వన్యప్రాణులకు మరణ మార్గంగా మారిపోయిందని అధికారులు తెలుసుకున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ మార్గంలో జరిగిన రైలు ప్రమాదాల్లో మొత్తం 18 పులులు ప్రాణాలు కోల్పోయినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పర్యావరణ ప్రేమికులు, వణ్యప్రాణుల సంక్షేమ సంఘాలు పలుమార్లు ఈ సమస్యపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం రైలు ప్రమాదాల్లో ఇలా పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఇలాంటి ఘనమైన అటవీ ప్రాంతాల్లో రైలు మార్గాలు వేసేటప్పుడు జంతువుల రక్షణ కోసం తగిన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాల్సిన అవసరం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ప్రత్యేకంగా వన్యప్రాణుల క్రాసింగ్ పాయింట్ల వద్ద సెన్సార్ సిస్టమ్స్, హెచ్చరికల వ్యవస్థలు ఏర్పాటు చేయడం, రైళ్ల వేగాన్ని నియంత్రించడం వంటివి తక్షణ చర్యలుగా చేపట్టాలని కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




