పాలిటిక్స్లోకి నితీష్ తనయుడి గ్రాండ్ ఎంట్రీ .. బీహార్ నెక్ట్స్ సీఎం ఎవరు..? రేసులో ఉన్నదెవరు..?
20 ఏళ్లు ఆయనే సీఎం.. ఇప్పుడు ఆయన సైడైపోతుండటంతో ఆ సీట్లోకి వచ్చేది ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈసారి ఛాన్స్ కమలం పార్టీకి దక్కనుండటంతో.. బీజేపీ నాయకత్వం ఎవరినీ బిహార్ సీఎం కుర్చీపై కూర్చొబెడుతుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రేసులో ఉన్న పేర్లకే బీజేపీ పెద్దలు టిక్ పెడతారా? లేక ఎవరూ ఊహించని కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లడం ఖరారు కావడంతో బీహార్ నెక్ట్స్ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి బీహార్ సీఎం కూడా బీజేపీకి దక్కనుండటంతో ఆ ఛాన్స్ ఆ పార్టీలోని ఏ నేతకు దక్కబోతోందనే దానిపై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 243 స్ధానాలున్న ప్రస్తుత అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి 202 స్ధానాలుండగా అందులో మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలిచింది. బీజేపీ 89 స్థానాల్లో విజయం సాధించగా.. జేడీయూ 85 స్ధానాల్లో గెలిచింది. అయినప్పటికీ సీఎంగా నితీష్ను ఎంపిక చేసింది బీజేపీ. ఇప్పుడు నితీష్ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళుతుండటంతో.. సీఎం పదవి దక్కించుకునే ఛాన్స్ అనూహ్యంగా బీజేపీకి దక్కింది.
ఈ క్రమంలోనే బీజేపీ నుంచి పలువురు నేతల పేర్లు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీహార్ ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. సామ్రాట్ చౌదరి బిహార్లోని వెనుకబడిన తరగతుల్లో ఒకటైన కుష్వాహా వర్గానికి చెందిన నాయకుడు. బీహార్లో యాదవుల తర్వాత కుష్వాహాలు రాష్ట్రంలోని ఓబీసీల్లో ఎక్కువ సంఖ్యలో ఉండటం సామ్రాట్ చౌదరికి కలిసొచ్చే అంశమనే వాదనలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ కుర్మి కమ్యూనిటీతో సామ్రాట్ చౌదరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో సీఎం నితీష్ కుమార్ సైతం సామ్రాట్ చౌదరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.
సామ్రాట్ చౌదరితో పాటు ప్రస్తుతం కేంద్రంలో హోంశాఖ సహాయమంత్రిగా వ్యవహరిస్తున్న నిత్యానందరాయ్ కూడా సీఎం రేసులో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా పని చేయడం ఈయనకు కలిసొచ్చే అంశం. హాజీపూర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం నిత్యానందరాయ్కు ఉంది. ఇక మరో నేత దిలీప్ కుమార్ జైస్వాల్ మూడుసార్లు శాసనమండలి సభ్యడుగా అనుభవం ఉండటంతో పాటు రాష్ట్ర బీజేపీ చీఫ్గా పని చేసిన రికార్డ్ ఉంది. వీరితో పాటు దిఘా ఎమ్మెల్యే సంజీవ్ చౌరాసియా పేరు కూడా సీఎం రేసులో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు విజయ్ కుమార్ సిన్హా, నితీష్ మిశ్రా, దిలీప్ జైస్వాల్, రామ్ కృపాల్ యాదవ్, జనక్ రామ్ వంటి నేతలు కూడా సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే బీజేపీ నాయకత్వం సీఎంలను ఎంపిక చేసే విషయంలో ఒక్కోసారి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంది. గుజరాత్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ సీఎంల ఎంపిక విషయంలోనూ ఆ పార్టీ నాయకత్వం ఇదే రకంగా వ్యవహరించింది. అందుకే బిహార్లో సీఎం పదవి కోసం అనేకమంది నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నా.. వివిధ సమీకరణాలు, సామాజిక కోణాలను పరిగణనలోకి తీసుకుని సీఎంలను ఎంపిక చేసే బీజేపీ నాయకత్వం మనసులో ఎవరున్నారనే విషయం అంతుచిక్కడం లేదు.
ఇదిలా ఉంటే రాజకీయాలకు దూరంగా ఉంటే నితీష్ కుమార్ తనయుడు నిషాంత్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పాట్నాలో గ్రాండ్గా నిషాంత్ పొలిటికల్ అరంగేట్రం జరిగింది. ఆయనకు జేడీయూ సభ్యత్వం ఇచ్చారు జేడీయూ నేతలు. ఈ క్రమంలో కార్యకర్తలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నిషాంత్ చెప్పారు. తన తండ్రి నితీష్ 20 ఏళ్లుగా చేసిన సేవను చూసి బిహార్తోపాటు యావత్ దేశం గర్వపడుతోందన్నారు. జేడీయూలో చేరిన నిషాంత్ కుమార్ ఆ పార్టీ తరపున బీహార్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
