IPL 2026: ధర్మశాలలో రజత్ పటీదార్ విధ్వంసం.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడో తెలుసా?
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 250కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఎప్పుడూ ఛేదించలేదు. ఈ మ్యాచ్లో గెలిచి నేరుగా ఫైనల్ చేరాలంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్లతో కూడిన టాప్ ఆర్డర్ అద్భుతం చేయాల్సి ఉంటుంది. మరోవైపు బెంగళూరు బౌలర్లు ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వశమవుతుంది.

ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఈ కీలక పోరులో ఆర్సీబీ బ్యాటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. కెప్టెన్ రజత్ పాటిదార్ వీరవిహారానికి తోడు విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు తోడవడంతో గుజరాత్ బౌలింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది.
పాటిదార్ ఆరెంజ్ క్యాప్ ఇన్నింగ్స్.. పరుగుల సునామీ..
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 7 బంతుల్లో 19 పరుగులు చేసి కాగిసో రబడా బౌలింగ్లో అవుట్ కాగా, ఆ తర్వాత విరాట్ కోహ్లీ (25 బంతుల్లో 43), దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. అయితే జేసన్ హోల్డర్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ అవుట్ చేసి ఆర్సీబీని దెబ్బతీశాడు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ ఆరంభంలో 11 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి కాస్త తడబడ్డాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి గుజరాత్ బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లోనే 281 స్ట్రైక్ రేట్తో 93 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడికి తోడుగా కృనాల్ పాండ్యా అండగా నిలవడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 254/5 పరుగుల భారీ స్కోరు సాధించింది. నాలుగో వికెట్కు వీరిద్దరూ రికార్డు స్థాయిలో 95 పరుగులు జోడించడం విశేషం.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యున్నత రికార్డులు..
ఈ మ్యాచ్లో ఆర్సీబీ సాధించిన 254 పరుగుల స్కోరుతో ఎన్నో పాత రికార్డులు కనుమరుగయ్యాయి. ఆ వివరాలు కింద ఉన్నాయి:
ప్లేఆఫ్స్లో అత్యధిక స్కోరు: ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఇదే అత్యధిక స్కోరు. గతంలో 2023లో ముంబైపై గుజరాత్ చేసిన 233 పరుగుల రికార్డును బెంగళూరు తుడిచేసింది.
ఒకే సీజన్లో అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు: ఈ సీజన్లో బెంగళూరుకు ఇది 9వ సారి 200 ప్లస్ స్కోరు కావడం విశేషం. ఈ రికార్డులో హైదరాబాద్, పంజాబ్ సరసన ఆర్సీబీ చేరింది.
ప్లేఆఫ్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు: ఈ ఇన్నింగ్స్లో బెంగళూరు బ్యాటర్లు ఏకంగా 14 సిక్సర్లు బాదారు.
గుజరాత్ ముందు కొండంత లక్ష్యం.. ఆర్సీబీ వ్యూహం ఇదే!
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 250కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఎప్పుడూ ఛేదించలేదు. ఈ మ్యాచ్లో గెలిచి నేరుగా ఫైనల్ చేరాలంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్లతో కూడిన టాప్ ఆర్డర్ అద్భుతం చేయాల్సి ఉంటుంది. మరోవైపు బెంగళూరు బౌలర్లు ఈ ముగ్గురిని త్వరగా అవుట్ చేస్తే మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వశమవుతుంది.
క్వాలిఫయర్-1 మ్యాచ్లో బెంగళూరు జట్టు చూపించిన బ్యాటింగ్ పరాక్రమం అభిమానులకు కంటి నిండా విందును అందించింది. రజత్ పాటిదార్ బాధ్యతాయుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ జట్టును సురక్షిత స్థానంలో నిలిపింది. ఈ కొండంత లక్ష్యాన్ని గుజరాత్ ఎలా ఎదుర్కొంటుందో, ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్ బెర్తును ఎలా ఖరారు చేసుకుంటుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
