ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి.. అసలు ఏం జరిగిందంటే?
సంతోషం మరువక ముందే ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితమే చెల్లెలి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించిన అన్న.. ఆ సంతోషం నుంచి బయటకు రాకముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రాత్రి కుటుంబంతో ఆనందంగా గడిపిన ఆయన తెల్లారే సరికి గుండెపోటుతో మృతి చెందారు.

చెల్లెలి సీమంతం చేసిన మూడ్రోజులకే అన్ని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన ములకలపాటి రవి–లీలావతి దంపతులకు కుమారుడు పార్థసారథి, కుమార్తె జాహ్నవి ఉన్నారు. వీరిద్దరూ అమెరికాలోని నార్త్ కరోలినా లో ఉంటున్నారు. పార్థసారథి ఉన్నత చదువులు పూర్తి చేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే వివాహం చేసుకున్న తన చెల్లెలికి సీమంతం నిర్వహించేందుకు తల్లితో కలిసి ఆనందంగా గడిపాడు.
గర్భవతి అయిన జాహ్నవి కి తోడుగా ఉండేందుకు తల్లి లీలావతి నెల రోజుల క్రితం అమెరికా వెళ్లారు. జాహ్నవి సీమంతం వేడుక మూడు రోజుల క్రితమే ఘనంగా జరిగింది. ఆ వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపిన పార్థసారథి.. గురువారం నిద్ర లేవకుండానే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
చెల్లెలి సీమంతం వేడుకలో సంతోషంగా కనిపించిన అన్న.. మూడు రోజుల్లోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం కుటుంబ సభ్యులను కన్నీటి పర్యంతం చేసింది. పార్థసారథి పార్థివ దేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు తండ్రి రవీందర్ కూడా అమెరికా కు బయల్దేరి వెళ్ళాడు. మనవడు గుండె పోటు తో మృతి చెందాడని తెలుసుకుని తాతయ్య రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు విశ్వనాధం తీవ్ర దిగ్బ్రాంతికి గురైనారు. మనువడు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
