Sachin Tendulkar: ఒక్క షేక్హ్యాండ్..రూ.7.5కోట్లు.. సచిన్ జీవితాన్ని మార్చిన ఆ ఒక్క సంతకం
Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ 1995లో చేసిన ఆ ఒక్క సంతకమే నేటి ఐపీఎల్, భారీ ఎండోర్స్మెంట్ల సంస్కృతికి పునాది వేసింది. ఒక క్రీడాకారుడు కేవలం ఆటగాడిగానే కాకుండా ఒక పవర్ ఫుల్ బ్రాండ్గా ఎలా ఎదగవచ్చో సచిన్ ప్రస్థానం నిరూపించింది.

Sachin Tendulkar: బెంగళూరులోని ఒక హోటల్ వేదికగా 1995లో జరిగిన ఒకే ఒక్క ఒప్పందం భారత క్రీడారంగ వాణిజ్య స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. 22 ఏళ్ల సచిన్ టెండూల్కర్ సంతకం చేసిన ఆ ఒక్క కాంట్రాక్ట్.. సాధారణ మ్యాచ్ ఫీజులపై ఆధారపడే భారత క్రికెటర్లను వందల కోట్ల బ్రాండ్లుగా మార్చే దిశగా తొలి అడుగు వేసింది. 1995 జులైలో రవిశాస్త్రి టీవీ వ్యాఖ్యాతగా పనుల్లో బిజీగా ఉన్న సమయంలో వర్డ్టెల్ అధినేత మార్క్ మస్కరెన్హాస్ను కలిశారు. సచిన్ టెండూల్కర్ కమర్షియల్ హక్కులను నిర్వహించేందుకు ఆసక్తి ఉందా అని రవిశాస్త్రి అడిగిన ప్రశ్నకు మార్క్ వెంటనే ఒప్పుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్లో బెంగళూరులోని తాజ్ రెసిడెన్సీ హోటల్లో సచిన్ సోదరుడు అజిత్ టెండూల్కర్తో మార్క్ సమావేశమయ్యారు. ఐదేళ్ల కాలానికి గానూ రూ.2.5 మిలియన్ డాలర్లు (అప్పట్లో మన కరెర్సీలో సుమారు రూ.7.5 కోట్లు) గ్యారెంటీ ఇస్తూ సచిన్ కమర్షియల్ రైట్స్ కోసం మార్క్ ఆఫర్ ఇచ్చారు. న్యాయవాదుల వివాదాలు, కమిటీల చర్చలు లేకుండా సచిన్ కుటుంబం ఒకే రోజులో ఈ చారిత్రక నిర్ణయం తీసుకుంది.
సుప్రీంకోర్టు తీర్పుతో మారిన భారత క్రికెట్ వ్యాపార సూత్రాలు
ఆ రోజుల్లో భారత ఆటగాళ్లకు యాన్యువల్ కాంట్రాక్టులు లేవు. క్రికెటర్లు కేవలం మ్యాచ్ ఫీజులు, చిన్నపాటి పత్రిక ప్రకటనలపైనే ఆధారపడేవారు. బీసీసీఐ మ్యాచ్లను ప్రసారం చేసేందుకు దూర్దర్శన్కే డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అయితే 1995 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎయిర్వేవ్స్ ప్రభుత్వ ఆస్తి కాదు, ప్రజా ఆస్తి అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో ప్రసార హక్కుల వేలం తెరుచుకుంది. 1996 ప్రపంచకప్ ప్రసార హక్కులను వర్డ్టెల్ సంస్థ 10 మిలియన్ డాలర్లకు దక్కించుకుంది. ప్రసార హక్కులతో పాటు భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన సచిన్ బ్రాండ్ హక్కులను కూడా ఒకే సంస్థ చేజిక్కించుకోవడం క్రీడా రంగంలో కొత్త అధ్యాయానికి తెరలేపింది.
ఎంఆర్ఎఫ్ నుంచి పెప్సీ వరకు
సచిన్ సోదరుడు అజిత్ పెట్టిన ఏకైక నిబంధన ఏంటంటే.. బ్రాండ్ షూటింగ్లు సచిన్ ప్రాక్టీస్, విశ్రాంతికి ఎలాంటి విఘాతం కలిగించకూడదు. మార్క్ దీనిని కచ్చితంగా పాటించారు. క్రికెట్ బ్యాట్పై ఎంఆర్ఎఫ్ లోగో వేయడం నుంచి పెప్సీ, బూస్ట్, అడిడాస్, విసా, కోల్గేట్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లను సచిన్ వద్దకు తెచ్చారు. ఐదేళ్ల కాల పరిమితి ముగిసేసరికి ఈ ఒప్పందం ద్వారా దాదాపు రూ. 30 నుంచి 35 కోట్ల వరకు వ్యాపారం జరిగింది. 1999లో సచిన్ తండ్రి రమేష్ టెండూల్కర్ మరణించినప్పుడు మార్క్ స్వయంగా సచిన్ను ఎయిర్పోర్ట్లో దింపి ఆదుకున్నారు. ఆ తర్వాతి కాలంలో క్రికెట్ను మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాలు చుట్టుముట్టినా, సచిన్ మంచి వ్యక్తిత్వం వల్ల బ్రాండ్ విలువ తగ్గలేదు.
ప్లేయర్ నుంచి బిజినెస్ ఇన్వెస్టర్గా సచిన్ ప్రస్థానం
2001 నాటికి వర్డ్టెల్ సంస్థ ఈ కాంట్రాక్ట్ను 17.5 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.100 కోట్లు) పునరుద్ధరించింది. భారతదేశంలో రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి అథ్లెట్గా సచిన్ నిలిచారు. 2002లో మార్క్ మరణించిన తర్వాత, 2006లో వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ ఈ హక్కులను రూ. 180 కోట్లకు దక్కించుకుంది. మైదానానికి వీడ్కోలు పలికిన తర్వాత సచిన్ తన స్వంత మేనేజ్మెంట్ సంస్థ ద్వారా వివిధ స్టార్టప్లు, లూమినస్, అన్అకాడమీ, స్పిన్నీ వంటి కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. 2026 నాటికి సచిన్ నికర ఆస్తి విలువ దాదాపు 170 మిలియన్ డాలర్లు (రూ.1,415 కోట్లు)గా అంచనా వేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
