Tamil Nadu: బీజేపీతో డీఎంకే చేతులు కలుపుతుందా..? క్లారిటీ ఇచ్చిన మాజీ కేంద్ర మంత్రి!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన డీఎంకే ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమిలోని ప్రధాన మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతుండటంతో డీఎంకే భవిష్యత్ వ్యూహంపై చర్చలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో డీఎంకే బీజేపీతో చేతులు కలపబోతోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన డీఎంకే ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమిలోని ప్రధాన మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా దూరమవుతుండటంతో డీఎంకే భవిష్యత్ వ్యూహంపై చర్చలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో డీఎంకే బీజేపీతో చేతులు కలపబోతోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఆ ప్రచారానికి డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ.రాజా స్పష్టమైన వివరణ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమిని వీడటం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే కాంగ్రెస్ కొత్త రాజకీయ పొత్తులు వెతుక్కుంది. వీసీకేతో కలిసి అధికార పార్టీ టీవీకేతో జతకట్టింది. కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ.. డీఎంకే నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
ఈ పరిణామాల మధ్య ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే దూరంగా ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తించింది. కాంగ్రెస్ పాల్గొంటున్న సమావేశాన్ని బహిష్కరించిన డీఎంకే, జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ మార్గాన్ని అన్వేషిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో డీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశముందన్న ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగింది.
అయితే ఈ వదంతులను ఎ.రాజా పూర్తిగా ఖండించారు. ఇండియా కూటమి నుంచి దూరంగా ఉన్నంత మాత్రాన బీజేపీతో చేతులు కలపబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు తమ పార్టీ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని, రాష్ట్రాల హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. దీంతో డీఎంకే-బీజేపీ పొత్తుపై జరుగుతున్న ఊహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది.
ఇక మరోవైపు డీఎంకే కూటమిలో మిగిలిన పార్టీల భవిష్యత్పై కూడా అనిశ్చితి నెలకొంది. సీపీఐ, సీపీఎం వంటి వామపక్ష పార్టీలు ప్రస్తుత పరిస్థితుల్లో డీఎంకేతో కలిసి కొనసాగడం కష్టమని సంకేతాలు ఇచ్చాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ స్పందిస్తూ.. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారిపోయాయని, భవిష్యత్ ఎన్నికల సమయంలోనే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్, వీకేసీ, ఐయూఎంఎల్ ఇప్పటికే డీఎంకే కూటమికి దూరమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఎండీఎంకే కూడా త్వరలో కూటమి నుంచి వైదొలిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దురై వైకో సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
మొత్తంగా చూస్తే తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు బలమైన కూటమికి నాయకత్వం వహించిన డీఎంకే ఇప్పుడు ఒంటరి పోరాటానికి సిద్ధమవుతుందా? లేక కొత్త మిత్రులను వెతుక్కుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల దిశగా డీఎంకే తీసుకునే నిర్ణయాలు తమిళనాడు రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
