రేషన్ కార్డు ఉన్నవారికి సూపర్ గుడ్న్యూస్.. ఈ మార్టుల్లో తక్కువ ధరకే నిత్యావసర సరుకులు!
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. పేద ప్రజలకు తక్కువ ధరలోనే నిత్యావసర వస్తువులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని రేషన్ దుకాలణాను మీ మార్టులుగా మార్చేందుకు చర్యలు చేపట్టింది.ఇది ప్రజలతో పాటు రేషన్ డీలర్స్కు సైతం ఆర్థకంగా సహాయపడనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు భారీ ఉపశమనం కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు తక్కువ ధరకే సరుకులు అందించేందుకు సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రేషన్ దుకాణాలను మీ మార్టులుగా మారుస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.
250 రకాల సరుకులు.. రూ.5 తక్కువకే
ఈ మీ మార్టులు రేషన్ దుకాణాలకు అనుసంధానంగా పనిచేస్తాయి. వీటిలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యంతో పాటు నిత్యం వాడే దాదాపు 250 రకాల నాణ్యమైన సరుకులను అందుబాటులో ఉంచనున్నారు. అంతేకాకుండా, బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే ఇక్కడ ప్రతి వస్తువుపై ఐదు రూపాయల వరకు తక్కువ ధరకే వీటిని ప్రజలకు విక్రయిస్తారు.
డీలర్ల ఆర్థిక భరోసా కోసం..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఎండీయూ (MDU) వాహనాల వల్ల రేషన్ డీలర్ల జీవనోపాధి దెబ్బతిన్న నేపథ్యంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ వాహనాలను తొలగించింది. రేషన్ షాపులను బలోపేతం చేయడంతో పాటు, డీలర్ల కుటుంబాలకు అదనపు ఆదాయం కల్పించి ఆర్థిక స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యంగా ఈ మార్టులను రూపొందించారు.
తొలి దశలో 1,000 దుకాణాలు
ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో వెయ్యి రేషన్ దుకాణాలను మీ మార్టులుగా మార్చనున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 553 షాపులను తక్షణమే ప్రారంభిస్తుండగా, మిగిలిన షాపులను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.
లాలుపురంలో ప్రారంభమైన మొదటి మార్ట్
రాష్ట్రంలోనే మొట్టమొదటి మీ మార్ట్ ను గుంటూరు జిల్లా లాలుపురంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ మార్టు.. నీది నాది మనందరిది అనే ట్యాగ్లైన్తో ఈ వ్యాపార కార్యకలాపాలు సాగుతాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ మార్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
