Kishan Reddy: తెలంగాణ వాసులకు కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి గుడ్న్యూస్.. కొత్తగా 2700 ఉద్యోగాలు..
Centre Govt allocates Tadicherla Coal Block-2 to Singareni : తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం అధిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు తాజాగా ఢిల్లీలో సింగరేణికి తాడిచర్ల బ్లాక్ -2ను కేటాయిస్తూ కేంద్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైల్పై సంతకం చేశారు. కేంద్రం తాజా నిర్ణయంతో తెలంగాణ వాసులకు సుమారు 2,700 కొత్త ఉద్యోగాల వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ ప్రజలకు, సింగరేణి ఉద్యోగులకు, కార్మిక లోకానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ను సింగరేణి సంస్థకే (SCCL) కేటాయిస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేటాయింపునకు సంబంధించిన అధికారిక ఫైలుపై ఆయన తాజాగా సంతకం చేశారు. తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రధాని మోదీ సానుకూల దృక్పథంతో ఉన్నారని, అందుకే చట్టపరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ప్రధాని అనుమతితో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయం నుండి తాడిచర్ల-2 బ్లాక్ను సింగరేణికి ఇవ్వాలని నాటి సీఎం కోరినప్పటికీ, అది ఇప్పుడు సాకారమైందని ఆయన గుర్తుచేశారు.
రూ. 64,000 కోట్ల భారీ ఆదాయం..
తాడిచర్ల-2 బ్లాక్ కేటాయింపు ద్వారా సింగరేణి సంస్థతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆర్థిక లబ్ధి చేకూరనుంది. ఈ బ్లాక్లో దాదాపు 182 మిలియన్ టన్నుల అత్యంత నాణ్యమైన గ్రేడ్-8 బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున దాదాపు 40 నుండి 50 ఏళ్ల పాటు ఇక్కడ బొగ్గు ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ గనిని ఓపెన్ ఆక్షన్ (వేలం) లేకుండా నేరుగా సింగరేణికి ఇవ్వడం వల్ల సంస్థకు కనీసం రూ. 2,550 కోట్ల మిగులు ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా రూ. 64,000 కోట్లకు పైగా ఆదాయం జనరేట్ అవుతుంది. రాయల్టీ, ఇతర పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దాదాపు రూ. 16,000 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది.
2,700 కొత్త ఉద్యోగాలు
ఈ సరికొత్త బొగ్గు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తాడిచర్ల బ్లాక్-2 ద్వారా సంస్థలో సుమారు 1,200 అదనపు ఉద్యోగాల కల్పన జరగనుంది. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ ద్వారా మరో 1,500 కొత్త ఉద్యోగాలను ఇచ్చేందుకు వీలుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం పట్ల సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణికి ఈ మైనింగ్ లీజ్ కేటాయించినందుకు గాను ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
