PM Modi: బాలికల చదువుకోసం విశ్రాంత టీచర్ డబ్బులు డిపాజిట్.. ప్రధాని మోడీ ప్రకాశంజిల్లా వాసిపై ప్రశంసల వర్షం
ఓ టీచర్ అందరికంటే భిన్నం అని నిరూపించారు. తాను ప్రభుత్వం ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన అనంతరం వచ్చిన డబ్బుతో బాలికల చదువు కోసం కృషి చేస్తున్నారు. తాజాగా బాలికల చదువు కోసం కృషి చేస్తున్నఆ టీచర్ పై మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు
PM Modi Praises AP teacher: మనం మంచి తనంతో మానవత్వంతో చేసే పనులు.. పదిమంది ప్రశంసలను అందుకుంటాయి. అయితే నేటి సమాజంలో అన్ని విషయాల్లో మార్పులు వచ్చినట్లే.. మానవ సంబంధాల్లో మార్పులు వచ్చాయి. తమ సంపాదన తమ కోసం తమ భవిష్యత్ తరాల కోసం అని ఆలోచించేవారు ఎక్కువ.. అయితే ఓ టీచర్ అందరికంటే భిన్నం అని నిరూపించారు. తాను ప్రభుత్వం ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన అనంతరం వచ్చిన డబ్బుతో బాలికల చదువు కోసం కృషి చేస్తున్నారు. తాజాగా బాలికల చదువు కోసం కృషి చేస్తున్నఆ టీచర్ పై మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ టీచర్ చేస్తోన్న కృషిని అభినందించారు. ఆ టీచర్ ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి మార్కాపురం రాంభూపాల్రెడ్డిని ప్రధాని మోడీ అభినందించారు. వందమంది బాలికల చదువుకోసం ఆయన సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిపించారని తెలిపారు. ఈ సందర్భంగా పదవీవిరమణ తర్వాత వచ్చిన రూ.26 లక్షలను వారి ఖాతాల్లో వేశారని ప్రశంసించారు. యడవల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు రామ్ భూపాల్రెడ్డి చేసిన నిస్వార్థ చర్యను ప్రధాని ఆదివారం ‘మన్కీ బాత్’లో ప్రస్తావించారు.
ప్రాథమిక పాఠశాలలో టీచర్గా ఉద్యోగాన్ని మొదలు పెట్టిన మార్కాపురం రాంభూపాల్ రెడ్డి తన జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. కాలక్రమంలో మండలం పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడిగా అనంతరం రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. తాను జీవితంలో ఎదిగే కొలదీ.. విద్యార్థుల చదువుకి అండగా నిలబడ్డారు. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం, బట్టలు, పుస్తకాల పంపిణీ, స్నాక్స్ ఏర్పాటు చేయడంవంటి కార్యక్రమాలను నిర్వహించేవారు. ఆయన సేవలను గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది.
ఇక రిటైర్ అయిన అనంతరం తనకు వచ్చిన రూ. 26 లక్షల నగదును కూడా పేద విద్యార్థుల చదువుకోసం వినియోగించారు. నగదు మొత్తాన్ని స్థానిక పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 100 మంది పేద బాలిక పేరుతో సుకన్య సమృద్ధి యోజన పథకం కింద అకౌంట్లు ఓపెన్ చేసి.. తన ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన నగదుపై వస్తున్న వడ్డీని జమ చేశారు. ప్రతి మూడు నెలలకు .. డిపాజిట్పై రూ. 41,000 వడ్డీ మొత్తం ఈ విద్యార్థులకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఇలా బాలికలకు 21 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వారి ఖాతాలకు నగదు జమ చేయబడుతుంది. ఈ విషయం ప్రధాని మోడీ దృష్టికి చేరుకుంది. దీంతో ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో రాంభూపాల్రెడ్డి గురించి ప్రస్తావిస్తూ.. ప్రధాని మోడీ ప్రశంసించారు. ఆదివారం గిద్దలూరులో పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రాంభూపాల్రెడ్డిని బీజేపీ నాయకులు సన్మానించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..