ఘోరం.. 2 రోజుల క్రితమే గోల్డ్ మెడల్.. అంతలో దారుణ హత్య!
ఈ సారి జపాన్ లో జరగనున్న పారా ఆసియా గేమ్స్కు అర్హత సాధించిన అథ్లెట్ చిరాగ్ త్యాగి (25) దారుణ హత్యకు గురయ్యాడు. తోటి అథ్లెట్ ఈర్ష్యతో గన్ తో కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంతో నమ్మకంగా ఉన్న స్నేహితుతే చిరాగ్ ను హత్య చేశాడు..

ఘాజియాబాద్, మే 31: జాతీయ స్థాయి పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లోని సాయి ఉప్వాన్ ప్రాంతంలో చనిపోయి కనిపించాడు. దీనిపై శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. రెండో రోజుల క్రితమే అక్టోబర్లో జపాన్లో జరగనున్న పారా ఆసియా గేమ్స్కు అర్హత సాధించిన చిరాగ్.. అంతలోనే విగత జీవిగా మారాడు. గత బుధవారం ఉదయం తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన చిరాగ్ మధ్యాహ్నం 3:30 గంటలకల్లా ఇంటికి చేరుకుంటానని తెలిపాడు. అయితే ఆ తర్వాత అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శనివారం మధ్యాహ్నం ఘాజియాబాద్లోని సాయి కుంజ్ ప్రాంతంలో చిరాగ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో అతడిని కాల్చిచంపినట్లు అనుమానించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మరో పారా అథ్లెట్ యశ్ ఖతిక్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యశ్ ఖతిక్, చిరాగ్ త్యాగి గతంలో కలిసి శిక్షణ పొందినట్లు, ఇద్దరూ ‘బ్లైండ్’ విభాగంలో పోటీపడినట్లు వెల్లడైంది. దాదాపు పదేళ్లుగా స్నేహితులుగా ఉన్న వీరు ఒకే గదిలో నివసిస్తూ ఐదేళ్లుగా కలిసి కఠిన సాధన చేశారు. చిరాగ్ తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలను కూడా యశ్తో పంచుకునేంతగా స్నేహితుడిని నమ్మాడు. అయితే యశ్ ఖతిక్కు సంబంధించిన పత్రాల ధృవీకరణ విషయంలో చిరాగ్ గతంలో ఫిర్యాదు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ఫిర్యాదు కారణంగా యశ్ అనర్హతకు గురయ్యాడని, దీంతో చిరాగ్పై కక్ష పెంచుకుని ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. చిరాగ్ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి యశ్ ఖతిక్ వెనుక నుంచి కాల్చి చంచినట్లు డీసీపీ ధవల్ జైస్వాల్ తెలిపారు. ఈ ఘటనలో నిందితుడు యశ్ ఖతిక్ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. హత్యకు ఉపయోగించిన తుపాకీ స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల ఖచ్చితమైన కారణాలు, హత్య జరిగిన విధానం పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా రెండు రోజుల క్రితమే బెంగళూరులో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ 400 మీటర్ల పరుగు పందెం పోటీల్లో చిరాగ్ గోల్డ్ మెడల్ సాధించి జపాన్లో జరగనున్న పారా ఆసియా గేమ్స్కు అర్హత సాధించాడు. అయితే అంతలోనే చిరాగ్ మృత్యువాత పడ్డటం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
