Tirupati: శ్రీవారి భక్తులకు అలర్ట్.. వారిని నమ్మొద్దంటున్న టీటీడీ!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి చాలా మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అయితే వారిలో కొందరు త్వరగా దర్శనం చేసుకోవాలనుకొని టీటీడీ నిర్దేషించిన విదానంలో కాకుండా.. దళారులను నమ్ముకుని మోసపోతుంటారు. ఈ సమస్యపై దృష్టి సారించిన టీటీడీ తమ భక్తులకు కొన్ని కీలక సూచనలు చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు దళారులను ఆశ్రయించొద్దని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది. శ్రీవారి దర్శనం, వసతి కోసం టిటిడి అధికారిక వెబ్సైట్, టోకెన్ జారీ కౌంటర్ల ద్వారా దర్శన టికెట్లు పొందాలను తెలిపింది.

కొందరు కేటుగాళ్లు టీటీటీ అధికారిక వెబ్సైట్ తరహా నకిలీ వెబ్సైన్ను తయారు చేసి భక్తులను మోసం చేస్తున్నట్టు టీటీడీ గుర్తించింది. ఈ మధ్య శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తామని వనం నటరాజ నరేంద్ర కుమార్, కెఎస్. నటరాజ శర్మలు రూ. 90 వేలు తీసుకుని మోసం చేసినట్లు హైదరాబాద్కు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని టీటీడీ పేర్కొంది. 2024 ఆగస్టు 16న 12 మంది నుంచి రూ.90 వేలు వసూలు చేసినట్లు తెలిపింది. శ్రీవారి దర్శనం చేయించని నరేంద్ర కుమార్, నటరాజ్ శర్మల చేతిలో మోసపోయిన విశ్వనాథ్.. వాళ్ళను డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినా స్పందించ లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్టు టీటీడీ తెలిపింది.
విశ్వనాథ్ ఫిర్యాదు తరువాత టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణలో ఇద్దరు నిందితులు హైదరాబాద్ జంట నగరాలలో పలువురిని ఇలాగే మోసం చేస్తున్నారని తేల్చింది. ఇప్పటికే దీనిపై దాదాపు 12 పోలీసు కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దళారుల అవతారం ఎత్తిన వనం నటరాజ నరేంద్ర కుమార్, నటరాజ శర్మలు టిటిడి ఉద్యోగులు కాదని, వారికి టిటిడితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. భక్తుల నుండి తరచూ నకిలీ దర్శన టికెట్ల బుకింగ్పై టిటిడికి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. శ్రీవారి దర్శనం, వసతి కోసం అనధికార వెబ్ సైట్ లను ఆశ్రయించి వద్దని, టిటిడి వెబ్సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సూచించింది.
టిటిడి సేవలకు సంబంధించి https://ttdevasthanams.ap.gov.in , ttdevasthanams మొబైల్ యాప్ ద్వారా, ఆన్లైన్లో తమ ఆధార్ కార్డు ఆధారంగా బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది. టిటిడి సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తుంది. దళారుల అక్రమాలపై భక్తులకు టిటిడి పలు ప్రసార, ప్రచార మాధ్యమాల్లో అవగాహన కల్పించేందుకు టిటిడి చర్యలు చేపట్టింది. దళారులపై అనుమానం వస్తే వెంటనే టిటిడి విజిలెన్స్ విభాగానికి 0877-2263828 ఫోన్ నెంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని టిటిడి కోరుతోంది. విజిలెన్స్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని, ఫిర్యాదు చేయాలని టిటిడి సూచిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




