Andhra: ఆ మహిళకు 6 నెలలుగా తగ్గని జ్వరం, దగ్గు.. టెస్టులు చేయగా ఊపిరితిత్తుల్లో
దగ్గు, జ్వరం వంటివి జనరల్గా వాతావరణం మారితే కనిపించే సాధారణ వ్యాధి లక్షణాలే. కానీ అనంతపురానికి చెందిన 60 ఏళ్ల మహిళకు ఇవి ఆరునెలలుగా తలనొప్పిగా మారాయి. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా, చికిత్సలు చేసినా ఫలితం లేకపోయింది. చివరికి .. ..

అనంతపురంకు చెందిన ఆ మహిళ వయసు అరవై. ఆరు నెలలుగా దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో ఎన్నో ఆసుపత్రులు తిరిగింది. కానీ ఎక్కడా ఆ పరిస్థితికి సరైన కారణం దొరకలేదు. చివరకు అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆసుపత్రి వైద్యులు ఆమె వేదన వెనుక అసలు కారణాన్ని కనుగొన్నారు. ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న వక్క కారణంగా ఆమె ఈ ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు తేల్చారు.
మొదట ఈ సమస్యను సాధారణ ఇన్ఫెక్షన్గా భావించి లోకల్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. దగ్గు, జ్వరం తగ్గకపోవడంతో ఆందోళనలో ఉన్న ఆ మహిళ చివరికి కిమ్స్ సవీరా వైద్యులను సంప్రదించారు. అక్కడ కన్సల్టెంట్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ యశోవర్ధన్ మంగిశెట్టి ఆధ్వర్యంలో చేసిన టెస్టుల్లో అసలు కారణం బయటపడింది.
“మేము చేసిన అడ్వాన్స్డ్ టెస్టుల్లో ఊపిరితిత్తుల్లో ఏదో వస్తువు ఇరుక్కుపోయినట్లు తెలిసింది. దాన్ని తొలగించడానికి రిజిడ్ బ్రాంకోస్కోపీ పద్ధతిని ఉపయోగించాం. రిజిడ్ ఫోర్సెప్స్తో ఆ వక్క గింజను జాగ్రత్తగా బయటకు తీశాం” అని డాక్టర్ యశోవర్ధన్ వివరించారు. దాన్ని తొలగించిన తర్వాత ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా రికవరీ అయ్యాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఉన్న ఇబ్బంది, దగ్గు, జ్వరం అన్నీ తక్షణమే తగ్గిపోయాయి.
“ఇలాంటి చికిత్సలు అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీలో భాగం. సాధారణ చికిత్సలు సాధ్యం కాని పరిస్థితుల్లో కూడా ఈ పద్ధతులు రోగుల ప్రాణాలను రక్షిస్తాయి. కొన్నిసార్లు సాధారణ దగ్గు లేదా జ్వరం వెనక ఊహించని కారణాలు దాగి ఉంటాయి. సకాలంలో సరైన నిర్ధారణ, నిపుణుల వైద్యంతో ప్రాణాలను కాపాడవచ్చు” అని డాక్టర్ యశోవర్ధన్ చెప్పారు.




