Elections 2024: ఏపీలో కౌంటింగ్ రోజున అల్లర్లు జరగకుండా అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్పై ఫుల్ పోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్.. ఆతర్వాత జరిగే పరిణామాలపై ముందస్తుగా అలర్ట్ అయింది. విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ చేపట్టింది.
![Elections 2024: ఏపీలో కౌంటింగ్ రోజున అల్లర్లు జరగకుండా అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/security.jpg?w=1280)
ఆంధ్రప్రదేశ్పై ఫుల్ పోకస్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్.. ఆతర్వాత జరిగే పరిణామాలపై ముందస్తుగా అలర్ట్ అయింది. విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ చేపట్టింది.
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ సిరీయస్ అయింది. దాడులను దృష్టిపెట్టుకుని .. ఎన్నికల సంఘం అలర్ట్ అయింది. కౌంటింగ్, తర్వాత జరిగే పరిణామాలపై ఈసీ ఫోకస్ పెంచింది. కౌంటింగ్ రోజు, ఆ తర్వాత 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచన చేసింది. రాష్ట్రానికి అదనంగా మరో 25 కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది. ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇవాళో రేపు మరో 5కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి.
ఏపీ ఎలక్షన్ కౌంటింగ్లో హింసాత్మక ఘటనలు జరగకుండా అన్ని జిల్లాలకు స్పెషల్ పోలీసు ఆఫీసర్లను నియమించారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించిన పల్నాడులో అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను నియమించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పని చేస్తున్న లావణ్య లక్ష్మిని.. విజయవాడ పోలీస్ కమిషనరేట్కు సిఐడి డిఎస్పి సోమన్నను నియమించారు ఏపీ డీజీపీ.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని రెల్లి వీధిలో CI చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలు, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేశారు. పత్రాలు లేని పలు బైక్లను పోలీస్ స్టేషన్కి తరలించారు.
అనంతపురం జిల్లాలోనూ అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాకు ముగ్గురు సెష్పల్ అధికారులను నియమించారు. వారికి సమస్యాత్మక ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించనున్నారు. మరోవైపు జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్కుమార్ మీనా. విశాఖపట్నం, శ్రీకాకుళంలో పర్యటించారు. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ తో కలిసి ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ల భద్రతను స్వయంగా పరిశీలించారు. విశాఖపట్టణం పార్లమెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీళ్లను సున్నితంగా పరిశీలించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఉన్నాయా? అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా? అనేక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కౌంటింగ్ కేంద్రా వద్ద మూడెంచల భద్రతను పాటించాలని, ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు ఎన్నికల ప్రధానాధికారి. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు వహించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు సీఈవో. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు.
కౌంటింగ్ రోజు కోసం భారీగా ప్రిపేర్ అవుతోంది ఈసీ. ఆరోజు కోసం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్రబలగాల నిఘా నీఢలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతోంది ఈసీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..