Jagan Government: ఏపీ విద్యార్థులకు గుడ్న్యూస్.. ల్యాప్టాప్లు వచ్చేస్తున్నాయ్..
జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులుగా విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేసేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో టెండర్ల ప్రాసెస్ ప్రారంభించింది.
రాష్ట్రంలో పేద విద్యార్థులకు వారి సమ్మతిని అనుసరించి ‘జగనన్న అమ్మఒడి’, ‘జగనన్న వసతి దీవెన’ స్థానంలో ల్యాప్టాప్లు అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్ను డిజిటల్ దిశగా నడిపించడంతోపాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ల్యాప్టాప్ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రాథమిక స్థాయి కాన్ఫిగరేషన్తో 5.62 లక్షల ల్యాప్టాప్ల కొనుగోలు చేయాలని భావిస్తోంది. లేటెస్ట్ కాన్ఫిగరేషన్తో 90,926 ల్యాప్టాప్ల కొనుగోలుకు టెండర్ ఆహ్వానిస్తోంది. ల్యాప్టాప్ల సరఫరాకు బిడ్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఆహ్వానించింది. ల్యాప్టాప్ల కొనుగోలు టెండరు విలువ వంద కోట్ల రూపాయల పరిమితి దాటడంతో టెండరు నోటీసులోని అంశాలను న్యాయసమీక్షకు పంపించింది. ఈ నెల 17 లోగా అభ్యంతరాలు, సూచనలు తెలపాలని ప్రభుత్వం కోరింది. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా ఏపీ జ్యూడీషియల్ ప్రివ్యూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈ అభ్యంతరాలు, సూచనలు సలహాలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా పథకాల నగదుకు బదులు ల్యాప్టాప్లు అందుకున్న విద్యార్థులు.. వాటిలో ఏమైనా లోపాలు తలెత్తితే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో ఆయా కంపెనీలు సమస్యను పరిష్కరించాలి. వీటికి మూడేళ్ల వారెంటీ ఉంటుంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు జగన్ సర్కార్ శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యా విధానాలు బాగుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయని సీఎం జగన్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్నే ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు.
Also Read: వరుస అత్యాచారాలు, హత్యలు.. గుంటూరు జిల్లాలో హడలిపోతున్న మహిళలు
పాపం ఆడపిల్ల లిఫ్ట్ అడిగింది కదా అని ఇచ్చాడు… ఆపై ఊహించని సీన్