ప్రయాణికులకు ముఖ్య గమనికః ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం..
ఈ నెల 17 తర్వాత ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉండటంతో ఆర్టీసీ బస్సు సర్వీసులు, రిజర్వేషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా, లాక్డౌన్ కారణంగా మార్చి 24నుంచి అన్ని వ్యవస్థలతో పాటు ప్రజా రవాణా కూడా స్తంభించిపోయింది. ఎక్కడివారెక్కడే ఉండిపోయారు. ఇక ఈ నెల 17 తర్వాత ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు అధికారు. ఈ క్రమంలోనే ఏపీ ఎస్ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు..అందుకోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారు.
ఆర్టీసీ బస్సు సర్వీసులు, రిజర్వేషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా దెబ్బకు కొద్దిరోజులు కండక్టర్ల వ్యవస్థను పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణికుల మధ్య తిరుగుతూ కండక్టర్లు బస్టిక్కెట్లు ఇస్తే.. కరోనా వ్యాప్తికి అవకాశం ఉంటుందని భావించిన అధికారులు..ప్రయాణికులు ఆన్లైన్లో, కరెంట్ రిజర్వేషన్, బస్టాండ్లు, బస్టాపుల్లో సిబ్బంది విక్రయించే టిక్కెట్లను కొని బస్సు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఇక, నాన్ ఏసీ బస్సుల విషయానికి వస్తే.. 150 కి.మీ.కుపైన దూరం వెళ్లే బస్సులకు 5 స్టాప్లు మాత్రమే ఉండాలి. అది కూడా ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. ఇక 150 కిలోమీటర్ల లోపు బస్సు సర్వీసులు అయితే ఆర్టీసీ నిర్దేశించిన కౌంటర్లలో టిక్కెట్లు తీసుకోవాలి. నాన్ స్టాప్ బస్సులకు కూడా ఇక ఆన్లైన్ రిజర్వేషన్లు ఉంటాయి.
పల్లె వెలుగు బస్సులకు సంబంధించి కూడా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రయాణికులు బస్టాండ్లు, ఆర్టీసీ సిబ్బంది, బుకింగ్ ఏజెంట్ల దగ్గర టిక్కెట్లు తీసుకోవాలి. బస్టాండుల్లో టిక్కెట్ల కోసం గ్రౌండ్ బుకింగ్ సాప్ట్వేర్తో టిమ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తారు. సిటీ బస్సుల్లో సైతం కండక్టర్లు లేకుండా కొన్ని స్టాపుల్లో టిక్కెట్లు తీసుకోవాలి. బస్సుల డోర్లకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అన్ని డిపోల మేనేజర్లకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ఈ నెల 18 నుంచి ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు కూడా పట్టాలేక్కనున్నట్లు తెలుస్తోంది.