Rajasaab: ఒక్క సీన్కి రూ.23 కోట్లు? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ మాత్రం ఏం చేస్తాడు!
ఒక్క పాట, ఒక్క సీన్, ఒక్క ఫైట్ సినిమా సక్సెస్ను డిసైడ్ చేస్తాయి. స్టార్ హీరో డేట్స్ కోసం డైరెక్టర్లు నిర్మాతలు నెలలు సంవత్సరాలు ఎదురుచూస్తారు. ఒక చిన్న డైరెక్టర్ చెప్పిన కథకు ఫిదా అయ్యి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్.

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదలకు సమయం ఆసన్నమైంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం, జనవరి 9న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఈ రోజు రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండటంతో అభిమానుల సందడి ఆకాశాన్ని తాకుతోంది. అయితే, ఈ సినిమాలోని ఒక క్రేజీ ఫైట్ సీక్వెన్స్కు సంబంధించిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల్లో గ్రాండియర్ కోసం నిర్మాతలు వెనకాడరు. కానీ ‘ది రాజా సాబ్’ విషయంలో ఒకే ఒక సన్నివేశం కోసం చిత్ర యూనిట్ చేసిన ఖర్చు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ప్రభాస్ మొసలితో పోరాడే దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ ఒక్క సీన్ కోసమే ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేశారట. ఒక చిన్న సినిమా బడ్జెట్తో సమానమైన ఈ మొత్తాన్ని కేవలం కొన్ని నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కోసం వెచ్చించడం విశేషం.
రెమ్యూనరేషన్ తగ్గించుకుని మరీ..
నిజానికి ఈ సీన్ షూటింగ్ దశలో ఉన్నప్పుడు బడ్జెట్ పరిమితుల దృష్ట్యా దీనిని తొలగించాలని దర్శకుడు మారుతి భావించారట. కానీ ప్రభాస్కు ఈ సీన్ ఐడియా విపరీతంగా నచ్చడంతో, అది సినిమాలో ఉండాల్సిందేనని పట్టుబట్టారట. బడ్జెట్ సమస్యగా మారితే తన రెమ్యూనరేషన్ నుంచి ఆ మొత్తాన్ని కోత విధించినా పర్వాలేదని, ప్రేక్షకులకు ఆ విజువల్ ట్రీట్ అందించాలని ప్రభాస్ కోరారట. హీరో స్వయంగా ముందుకు రావడంతో నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Prabhas Rajasaab
అయితే, ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ సీన్ అవుట్పుట్ విషయంలో చిత్ర యూనిట్ కాస్త సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఆశించిన స్థాయిలో ఆ గ్రాఫిక్స్ రాలేదని, అందుకే ఎడిటింగ్ టేబుల్ మీద దీనిని తొలగిద్దామనే చర్చ కూడా జరిగిందట. కానీ అప్పటికే ట్రైలర్లో ఈ మొసలి ఫైట్ బాగా వైరల్ అవ్వడంతో, ఫ్యాన్స్ నిరాశ చెందుతారనే ఉద్దేశంతో సినిమాలో అలాగే ఉంచాలని నిర్ణయించుకున్నారట.
ఈ నిర్ణయం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులతో పాటు బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ వంటి భారీ తారాగణం ఇందులో ఉంది. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్బస్టర్గా నిలిచింది.
