Warangal: మహిళా ట్రైనీ ఎస్సైకి లైంగిక వేధింపులు.. వరంగల్ సీపీ తరుణ్ జోషి సీరియస్
Warangal CP Tarun Joshi : మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మహిళా ట్రైనీ ఎస్సై పై సదర్ పోలీస్
Warangal CP Tarun Joshi : మహబూబాబాద్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లో మహిళా ట్రైనీ ఎస్సై పై సదరు పోలీస్ స్టేషన్ ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు మహిళా ట్రైనీ ఎస్సై మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ పేరుతో మహిళా ట్రైనీ ఎస్సైని ఒంటరిగా వాహనంలో తీసుకెళ్లిన ఎస్సై పి. శ్రీనివాస్.. ఆమెపై లైంగిక దాడికి యత్నించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.
గత కొద్దిరోజులుగా ట్రెయినీ ఎస్సైని వాట్సాప్, ఫోన్ కాల్ ద్వారా కూడా వేధించాడని సమాచారం. తాజాగా ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వరంగల్ సీపీ పరిధిలో పోస్టింగ్ తీసుకున్న సదరు ట్రైనీ ఎస్సై.. ఎస్హెచ్వోలున్న పోలీస్ స్టేషన్లో నెల రోజులు ప్రొహిబిషన్ పీరియడ్ను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎస్సై ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడం పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తీవ్రంగా స్పందించారు. జరిగిన సంఘటనపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మహిళా ట్రైనీ ఎస్ఐపై ఎస్సై శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా రుజువైతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తరుణ్ జోషి తెలిపారు.