Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. విడాకులకు ఫుల్స్టాప్ పెట్టేలా మాస్టర్ ప్లాన్..
తెలంగాణలో విడాకులు, కుటుంబ కలహాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి ప్రభుత్వం కొత్తగా ప్రీ-మ్యారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో నిపుణులు పెళ్లి చేసుకోబోయే యువ జంటలకు అవగాహన, వివాద పరిష్కారం, కుటుంబ బాధ్యతలపై శిక్షణ ఇస్తారు. మంత్రి సీతక్క ఈ ఫైల్పై సంతకం చేశారు.

చిన్న చిన్న కారణాలకే గొడవపడడం.. పంతాలకు పోయి దూరమవ్వడం.. చివరకు విడాకులు తీసుకోవడం.. ఇటువంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. కొంతమంది అయితే నెలలు కూడా కాపురం చేయడం లేదు. ఇటువంటి వాటికి బ్రేక్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. కుటుంబ వ్యవస్థ బలోపేతం చేసే ముఖ్యమైన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో పెరుగుతున్న వివాహ సంబంధ ఫిర్యాదులు, విడాకులు, కుటుంబ కలహాల నేపథ్యంలో యువ దంపతులకు సరైన మార్గదర్శనం అందించేందుకు ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం సమాజ నిర్మాణానికి, ముఖ్యంగా కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి చాలా అవసరమని మంత్రి సీతక్క తెలిపారు. ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లకు సంబంధించిన ఫైలుపై ఆమె సంతకం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 33 పీఎంసీసీలు ఏర్పాటు కానున్నాయి. మొదట్లో ఈ కేంద్రాలను సఖీ లేదా వన్ స్టాప్ సెంటర్లలో ఏర్పాటు చేస్తారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో సొంత భవనాలు కేటాయించనున్నారు.
ప్రతి కేంద్రంలో ఒక లీగల్ కౌన్సిలర్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్, ఒక హెల్పర్ నియమితులవుతారు. సిబ్బందికి నెలకు రూ.30 వేల వేతనం చెల్లించనున్నారు. సిబ్బంది జీతాలు, నిర్వహణ కోసం ఏడాదికి సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ సెంటర్లలోని నిపుణులు వివాహ బంధంలోకి అడుగుపెట్టే యువ జంటలకు అనేక కీలక అంశాలపై శిక్షణ, అవగాహన కల్పిస్తారు:
- పరస్పర అవగాహన
- వివాద పరిష్కారం
- భావోద్వేగ అనుకూలత
- చట్టపరమైన హక్కులు
- జెండర్ సెన్సిటివిటీ
- కుటుంబ బాధ్యతలు
ఈ అంశాలపై నిపుణులు కౌన్సిలింగ్ ఇస్తారు.
కౌన్సెలింగ్ అవసరం ఎందుకు..?
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, సఖీ కేంద్రాలకు ఇటీవల వివాహ సంబంధ ఫిర్యాదులు భారీగా పెరిగాయి. యువ జంటల మధ్య పరస్పర అవగాహన లోపం, వివాహంలో తల్లిదండ్రుల అధిక జోక్యం, చిన్న కుటుంబాలు పెరగడం, తరాల మధ్య బంధం తగ్గడం వంటివి వీటికి కారణాలుగా చెప్పొచ్చు. ఈ సమస్యలకు పరిష్కారంగానే ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్ల ఏర్పాటు అవసరమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మంత్రి సంతకం చేసిన ఈ ఫైల్కు త్వరలో ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే రాష్ట్రంలో ఈ పీఎంసీసీల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




