AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly: కులగణన సర్వేపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. తెలంగాణలో పొలిటికల్ హీట్..

కులగణన సర్వేపై చర్చ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం ఆసక్తికరంగా మారింది. కులగణన సర్వేపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంటే.. కేసీఆర్ హయాంలో చేపట్టిన సర్వేతోనే కారు పార్టీకి కౌంటర్ ఇవ్వాలని యోచిస్తోంది కాంగ్రెస్.

Telangana Assembly: కులగణన సర్వేపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. తెలంగాణలో పొలిటికల్ హీట్..
Telangana Assembly
Shaik Madar Saheb
|

Updated on: Feb 03, 2025 | 9:39 PM

Share

స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చించేందుకు అసెంబ్లీ, మండలి ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. సమగ్ర కులగణన సర్వే, స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ముందుగా కేబినెట్ భేటీలో చర్చిస్తారు. అనంతరం ఈ నివేదికలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ 42 శాతానికి పెంచుతామని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలమంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. అయితే సీఎం రేవంత్ మాత్రం దీనిపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ చర్చలో బీఆర్ఎస్‌, బీజేపీ సభ్యులనూ భాగస్వాములను చేసి.. పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు.

బీఆర్ఎస్‌ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే

ఈ సమావేశాల్లో బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరించబోతోందనే అంశంపై ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఓ సర్వేను చేపట్టారు. రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి ఈ సర్వే చేపడుతున్నట్టు అప్పట్లో బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అయితే ఆ సర్వే వివరాలను గత కేసీఆర్ సర్కార్ ఎందుకు బయటపెట్టలేదన్నది కాంగ్రెస్‌, బీజేపీల నుంచి ఇప్పటికీ వినిపిస్తున్న వాదన. తాజాగా అదే అంశంపై బీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ.

సమగ్ర కుటుంబ సర్వేను రాజకీయాల కోసం వాడుకున్నారు- అద్దంకి

బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సర్వే ద్వారా ప్రజల స్థితిగతులు తెలుసుకుని ఎన్నికల్లో తాయిలాలు ఇచ్చేందుకు దాన్ని వాడుకున్నారని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే అలాంటిది కాదన్నారు.

కులగణన సర్వే తప్పుల తడక అంటున్న బీఆర్ఎస్

అయితే బీఆర్ఎస్ మాత్రం కులగణన సర్వేను తప్పుల తడక అని విమర్శిస్తోంది. సర్వే చేయకుండా కులగణన నివేదిక ఇచ్చారని.. ఎన్నికల కోసమే హడావుడి సర్వే చేశారని ఆరోపించారు మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్..

కులగణన సర్వేపై చర్చ కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నప్పటికీ.. ఈ అంశంలో బీఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి, టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ముందస్తు వ్యూహంతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ఈ సమావేశంలో అధికార, విపక్షాల మధ్య ఏ రకమైన మాటల తూటాలు పేలబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..