- Telugu News Photo Gallery Cricket photos Sourav Ganguly on Gautam Gambhirs Coaching: Challenges Ahead and Test Cricket Advice
Gambhir: మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు..
గౌతమ్ గంభీర్ కోచ్గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ గెలిపించాడు. అయితే, 2027 వన్డే ప్రపంచకప్ అతనికి అసలైన సవాలని సౌరబ్ గంగూలీ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్లో గంభీర్ తన శైలిని మార్చుకోవాలని, స్వదేశంలో టర్నింగ్ వికెట్ల అవసరం లేదని గంగూలీ సూచించాడు.
Updated on: Mar 14, 2026 | 6:15 PM

గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ చరిత్రలో ఒక అగ్రశ్రేణి ఆటగాడిగా, ఇప్పుడు విజయవంతమైన కోచ్గా తనదైన ముద్ర వేశాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్లను ఆటగాడిగా గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్, ప్రస్తుతం భారత జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన తక్కువ సమయంలోనే రెండు ఐసీసీ టైటిళ్లను సాధించి చరిత్ర సృష్టించాడు.

అతని నేతృత్వంలో భారత జట్టు ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు టీ20 ప్రపంచకప్ను కూడా కైవసం చేసుకుంది. దీంతో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన తొలి భారత కోచ్గా అతడు అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గంభీర్ విజయ పరంపరపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ ప్రశంసలు కురిపిస్తూనే, అతని భవిష్యత్ సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్కు 2027 వన్డే ప్రపంచకప్ అసలైన సవాలుగా ఉంటుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో అతనికి నిజమైన పరీక్ష వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో ఎదురుకానుందని గంగూలీ పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాలోని పరిస్థితులు, పిచ్లు, వాతావరణం జట్టును, కోచ్ను తీవ్రంగా పరీక్షిస్తాయని తెలిపాడు. అయితే, గంభీర్ వద్ద ఉన్న జట్టుపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అతడు కోచ్గా మరోసారి ఖచ్చితంగా విజయం సాధిస్తాడని గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ టైటిల్ను తృటిలో కోల్పోయిన భారత జట్టు, వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల ప్రపంచకప్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. అంతేకాకుండా, సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే చివరి వన్డే ప్రపంచకప్ కానుండటంతో భారత్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ బాధ్యత మరింత పెరుగుతుందని గంగూలీ సూచించాడు.

అయితే, టెస్టు క్రికెట్లో మాత్రం గంభీర్ తన శైలిని మార్చుకోవాలని గంగూలీ సూచించాడు. టెస్టులలో గంభీర్ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా పిచ్ ఎలా ఉంటుందనే ఆలోచనను పక్కన పెట్టాలని చెప్పాడు. పిచ్ను ఒక భూతంలా చూడడం మానేయాలని హితవు పలికాడు. స్వదేశంలో జరిగే టెస్టు మ్యాచ్ల కోసం స్పిన్నర్లకు అనుకూలించే టర్నింగ్ వికెట్లు అవసరం లేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

మంచి వికెట్లపై ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయని, ఇటీవలి ఇంగ్లాండ్ సిరీస్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా, గంభీర్ నేతృత్వంలో భారత్ గతంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన టెస్టు సిరీస్లను కోల్పోయిన సంగతి గమనార్హం. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని గంభీర్ టెస్టు క్రికెట్కు సంబంధించిన తన వ్యూహాలను మార్చుకోవాలని గంగూలీ సూచించాడు.
