స్కూల్ టీచర్స్ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన అర్టెంట్ అనే ఒక్క మెసేజ్.. క్లిక్ చేయగానే..
సమయం, సందర్భం చూసి సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. తోటి ఉపాధ్యాయులు, మిత్రుల నుండి లక్ష రూపాయలకు పైగా కాజేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మనకు తెలిసిన వారే కదా అని వాట్సాప్ మెసేజ్లను నమ్మితే ఎంతటి ప్రమాదమో ఈ ఘటన నిరూపిస్తోంది. అసలేం జరిగిందంటే..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయుడి వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేసి, గ్రూప్ సభ్యుల నుండి లక్ష రూపాయలకు పైగా కాజేశారు. జహీరాబాద్కు చెందిన ఆనంద్ అనే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి వాట్సాప్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆ తర్వాత ఆనంద్కు తెలియకుండానే, ఆయన ఉన్న ప్రభుత్వ టీచర్స్ వాట్సాప్ గ్రూపుల్లోకి హ్యాకర్ చొరబడ్డాడు. గ్రూప్ సభ్యులను నమ్మించడానికి ఆనంద్ శైలిలోనే ఒక అత్యవసర మెసేజ్ పెట్టాడు. నా యూపీఐ ఐడీ పని చేయడం లేదు, ఇప్పుడే ఒకరికి అత్యవసరంగా రూ. 30 వేలు చెల్లించాలి, రెండు గంటల్లో తిరిగి ఇచ్చేస్తాను అంటూ నమ్మబలికాడు. దానికి తోడు ఒక యూపీఐ క్యూఆర్ కోడ్ (QR Code) స్క్రీన్ షాట్ను కూడా గ్రూపులో షేర్ చేశాడు.
తమ తోటి టీచర్ ఆనంద్కు నిజంగానే ఏదో సమస్య వచ్చిందని భావించిన గ్రూప్ సభ్యులు, మానవత్వంతో స్పందించి ఆ క్యూఆర్ కోడ్కు డబ్బులు పంపడం ప్రారంభించారు. ఇలా గ్రూపులోని పలువురి నుంచి సైబర్ నేరగాడు సుమారు రూ. లక్షకు పైగా గుంజేశాడు. ఈ గ్రూపులో ఉన్న ఎం. విఠల్ అనే బాధితుడిని హ్యాకర్ ప్రత్యేకంగా టార్గెట్ చేశాడు. తన మాటల చాతుర్యంతో విఠల్ నుంచి తొలుత రూ. 30 వేలు, తర్వాత రూ. 20 వేలు, ఆపై రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 60 వేలు లాగేసుకున్నాడు. అంతటితో ఆగకుండా మరో రూ. 17,500 పంపాలని కోరడంతో విఠల్కు అనుమానం వచ్చింది. వెంటనే ఆయన ఉపాధ్యాయుడు ఆనంద్కు నేరుగా ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసుకోగా అసలు విషయం బయటపడింది. తన వాట్సాప్ హ్యాక్ అయిందని ఆనంద్ చెప్పడంతో బాధితులంతా తలలు పట్టుకున్నారు.
మోసపోయామని గ్రహించిన వెంటనే బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమయ్యారు. వెంటనే కేంద్ర ప్రభుత్వ సైబర్ హెల్ప్లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన సైబర్ పోలీసులు.. సదరు సైబర్ నేరగాడి బ్యాంక్ అకౌంట్ను ఫ్రీజ్ చేశారు. దీంతో మిగిలిన గ్రూప్ సభ్యుల డబ్బుతో పాటు, మరింత సొమ్ము చేజారకుండా కాపాడగలిగారు. వాట్సాప్లో ఎంతటి ఆప్తులు, స్నేహితులు డబ్బులు అడిగినా.. ముందస్తుగా వారికి ఫోన్ చేసి నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే నగదు బదిలీ చేయాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




