New District Courts: కోర్టు తీర్పులపై కొందరు వక్రభాష్యం చేస్తున్నారు.. ఉపేక్షించేది లేదు.. కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ
New District Courts: అలాంటి వారి సంఖ్య పెరుగుతోందని, ఇది దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మతో కలిసి జిల్లా కోర్టుల ప్రారంభోత్సవంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..

సుప్రీంకోర్టు చీఫ్జస్టిస్ ఎన్వీ రమణ(CJI NV Ramana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొందరు కోర్టు తీర్పుల్ని ప్రభుత్వ ఆదేశాలకు వక్రభాష్యం చెబుతున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి వారి సంఖ్య పెరుగుతోందని, ఇది దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మతో కలిసి జిల్లా కోర్టుల ప్రారంభోత్సవంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేయడం తేలికైందని అన్నారు. పరిధి దాటనంత వరకు న్యాయ వ్యవస్థకు అందరూ మిత్రులేనన్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఒక అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించుకున్న అనేక మంది ఉద్యమకారులు, మేధావులు, ప్రత్యేకించి న్యాయవాద మిత్రలకు అభినందనలు తెలిపారు. అన్ని వర్గాల వారు మహోన్నత ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో న్యాయ వ్యవస్థ అభివృద్ధి కూడా ఎంతో కీలకమని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. న్యాయ వ్యవస్థ ఒక్కరి ప్రయోజనాలకోసం పనిచేయదని.. సమాజం, ప్రజలందరి సంక్షేమమే న్యాయవ్యవస్థకు ముఖ్యమని స్పష్టం చేశారు.
తెలుగు భాషను గౌరవించి, తెలుగు సంస్కృతికి పట్టం కట్టిన ఈ నేలపై ఈరోజు తెలుగులో మాట్లాడాలని నిర్ణయించుకున్నా. న్యాయవ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలని భావించి భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కృషి చేస్తున్నాను. న్యాయవ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుందని, దానిపట్ల విశ్వాసం, అవగాహన పెంచాలని, సమాజంలో ఆరోగ్యవంతమైన చర్చ జరగాలని.. ఏడాది కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాను.
ఈ పర్యటనల్లో న్యాయ వ్యవస్థ, న్యాయ విధానాల గురించి ప్రజలకు వివరించడంలో ఎంతో కొంత సఫలీకృతమయ్యానని భావిస్తున్నాని అన్నారు. అవసరం ఉన్నప్పుడు ఆసుపత్రికో, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినట్లుగా ఎలాంటి అపోహలు లేకుండా వివాదాలు వచ్చినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించే విధంగా ఒక సులవైన పద్ధతిని కనుక్కున్నాం. ప్రజలకు చేరువగా న్యాయ వ్యవస్థ ఉండాలని రాజ్యాంగం సూచించిన విధానాన్ని అమలు చేస్తూ.. ఇవాళ 32 జిల్లాల న్యాయసమాహారాన్ని ప్రారంభించుకున్నాం’’ అని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు.
33 జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థ ప్రారంభోత్సవం..
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జ్యుడిషీయల్ డిపార్ట్మెంట్లో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. హైకోర్టు ప్రాంగణం నుంచి 23 కొత్త జిల్లాల కోర్టులను వర్చువల్ విధానంలో సీఎం కేసీఆర్తో కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.
తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్
ఈ రోజు చాలా మంచి దినం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో 32 కొత్త జిల్లా కోర్టులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఒకసారి తెలంగాణ హైకోర్టు ప్రారంభోత్సవానికి వచ్చాను. ఇప్పుడు మళ్లీ 33 జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. అన్ని రంగాల్లో తెలంగాణ పురోగమనంలో ఉంది. చాలా అంశాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో నెంబర్ వన్గా ఉన్నామని వివరించారు. సీజేఐని కోరగానే హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచారని గుర్తు చేశారు. జిల్లా కొర్టుల విషయంలోనూ వెనువెంటనే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల్లో సెషన్స్ కోర్టులకు వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉండేదన్న సీఎం.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామన్నారు. పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంటే న్యాయం వేగంగా చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. పని భారం ఎక్కువగా ఉన్న కోర్టులను విభజిస్తే ప్రజలకు సత్వర న్యాయం జరిగే అవకాశముందని సీఎం సూచించారు.



