రంగాల వారీగా బడ్జెట్
బడ్జెట్ 2024-25
పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారి వంటగది బడ్జెట్ మోతమోగుతోంది. తిండి గింజలు, గ్యాస్, నూనె, పేస్ట్, సబ్బు ఇలా అన్నీ ఖరీదయ్యాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 1న తన చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో ధరాఘాతాన్ని తగ్గించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రతిపాదనలు చేస్తారని సాధారణ ప్రజలు ఆశిస్తున్నారు. టీవీ9 తెలుగు సామాన్య ప్రజల అభిప్రాయాలను ఆర్థిక మంత్రికి తెలియజేయడానికి ఒక సిరీస్ను ప్రారంభించింది. దీని ద్వారా దేశంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను ఆర్థిక మంత్రికి తెలియజేసే ప్రయత్నం జరుగుతోంది. దీని ద్వారా వివిధ రంగాలకు చెందిన వారు బడ్జెట్ నుంచి తాము ఏం కోరుకుంటున్నారన్నది ఆర్థిక మంత్రికి చేరవేయాలన్నదే మా ప్రయత్నం.
బడ్జెట్ 2024కి సంబంధించిన ఆసక్తికర ప్రశ్నలు – జవాబులు
ప్రశ్న – ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు?
జవాబు – ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తారు.
ప్రశ్న – ఇది పూర్తి బడ్జెట్ అవుతుందా లేక మధ్యంతర బడ్జెట్ అవుతుందా?
జవాబు – సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న సమర్పించే బడ్జెట్ మధ్యంతర బడ్జెట్గా ఉంటుంది.
ప్రశ్న – బడ్జెట్లో ఏ రంగానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు?
జవాబు – ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న బడ్జెట్ కావడంతో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసే అవకాశముంది.
ప్రశ్న – బడ్జెట్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా చర్యలు ఉంటాయా?
జవాబు – ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందువల్ల, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేయొచ్చు.
ప్రశ్న – బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఆటో పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఉంటాయా?
జవాబు – బడ్జెట్లో ఆటో పరిశ్రమకు ప్రోత్సాహం లభించవచ్చు. ముఖ్యంగా EV అమ్మకాలను పెంచే దిశగా ప్రత్యేక రాయితీలు ప్రకటించే అవకాశముంది.
ప్రశ్న – బడ్జెట్లో గృహ రుణంపై పన్ను మినహాయింపు పెంచుతారా?
జవాబు – ఈసారి బడ్జెట్లో గృహ రుణంపై పన్ను మినహాయింపు పరిధిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశముంది.
ప్రశ్న – బడ్జెట్లో మొదటిసారిగా వేతన జీవులకు లబ్ధి చేకూర్చింది ఎవరు?
జవాబు – ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో 1974 బడ్జెట్లో మొదటిసారి స్టాండర్డ్ డిడక్షన్ ప్రవేశపెట్టారు.
ప్రశ్న – బడ్జెట్కు ముందు హల్వా వేడుకను ఎందుకు జరుపుకుంటారు?
జవాబు – ఏదైనా శుభ కార్యం చేసే ముందు, ఏదైనా తీపి తినాలి.. అందుకే బడ్జెట్ వంటి పెద్ద కార్యక్రమాలకు ముందు ఈ వేడుకను నిర్వహించే సాంప్రదాయం ఉంది.
ప్రశ్న – రైల్వే బడ్జెట్ను బడ్జెట్లో ఎప్పుడు విలీనం చేశారు?
జవాబు – 2016లో అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చివరి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2017 నుంచి వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్ను విడివిడిగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి స్వస్తి పలికారు. రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లోనే విలీనం చేశారు.
ప్రశ్న – కేంద్ర బడ్జెట్ 2023-24 మేరకు ఏ మంత్రిత్వ శాఖకు అత్యధిక కేటాయింపులు చేశారు?
జవాబు – అత్యధికంగా రైల్వే మంత్రిత్వ శాఖకు రూ.2.40 లక్షల కోట్ల వ్యయ కేటాయింపులు చేశారు. ఇందులో మూలధన వ్యయం: రూ.2.01 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం: రూ.39,000 కోట్లు, సబ్సిడీలు: రూ.1,500 కోట్లు ఉంది.
ప్రశ్న- స్వతంత్ర భారత్లో తొలి కేంద్ర బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జవాబు – తొలి బడ్జెట్ను 1947 నవంబరు 26న నాటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు.
ప్రశ్న- అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినవారు ఎవరు?
జవాబు – కేంద్ర బడ్జెట్ను అత్యధికంగా 10సార్లు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు. 1962 నుంచి 69 మధ్య కాలంలో ఆర్థిక మంత్రిగా 10సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. పి.చిదంబరం 9సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ప్రశ్న- ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు
జవాబు – నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు ఐదుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 ఫిబ్రవరి 1న ఆరోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ప్రశ్న – బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఎప్పుడు మార్చారు?
జవాబు – 2016 వరకు కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి చివరి పనిదినం రోజు సమర్పించే సాంప్రదాయం ఉండేది. 2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ఫిబ్రవరి 1 తేదీకి మార్చారు. అప్పటి నుంచి ప్రతి యేటా ఆ తేదీన బడ్జెట్ సమర్పిస్తున్నారు.
ప్రశ్న- బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళలు ఎవరు?
జవాబు – ఇందిరా గాంధీ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 2019లో నాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు.