Union Budget 2024: బ్యాంకింగ్ రంగంలో ఈ అంశంలపై బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఉంటాయా?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగ్గానే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.

Union Budget 2024: బ్యాంకింగ్ రంగంలో ఈ అంశంలపై బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఉంటాయా?
Nirmala Sitharaman
Follow us

|

Updated on: Jan 19, 2024 | 2:01 PM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సరిగ్గానే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటి వరకు రూ.68,500 కోట్ల నికర లాభాలను ఆర్జించాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం వరుసగా రెండోసారి 2023-24 బడ్జెట్‌లో నిర్మాలా సీతారామన్ ఎలాంటి కేటాయింపులు చేయలేదు. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తికరంగా ఉందన్నదానికి ఇది సంకేతం. బ్యాంకులు తమ వనరులను పెంపొందించుకోవడానికి మార్కెట్ నుండి నిధులను సేకరిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రీక్యాపిటలైజేషన్ కోసం 20,000 కోట్ల రూపాయల మద్ధతు పొందాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా నిర్ణయాలు భారత బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఆ కారణంతోనే ఇటీవల దేశీయ స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. అలాగే బ్యాంకుల మూడో త్రైమాసిక ఫలితాలు కూడా కాస్త నిరాశాజనకంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు నిర్మలా సీతారామన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

2024 ఎన్నికల సంవత్సరం అయినందున కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతన బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అందుకే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఈ మధ్యంతర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ భారీ నిర్ణయాల జోలికి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండి బకాయిల వసూలు దిశగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని బ్యాంకింగ్ రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో దాదాపు 2 లక్షల కోట్ల మొండి బకాయిల వసూళ్ల కోసం.. బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించిన పురోగతిపై కేంద్రం నిర్ణయాలు ఎలాంటి ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే బ్యాంకుల విలీన ప్రక్రియను కొనసాగిస్తున్న కేంద్రం.. ఈ దిశగా బడ్జెట్‌ కొత్త ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది.