CM KCR: మరెన్నో ఏళ్లు సేవలందించాలి.. గవర్నర్ తమిళిసైకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు. పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్.. గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు.
CM KCR – Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళిసైకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు.. దేవుడి ఆశీస్సులతో మీరు మరిన్ని సంవత్సరాలపాటు ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్తోపాటు.. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదిక ద్వారా గవర్నర్కు జన్మదిన (Tamilisai Soundararajan Birthday) శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రభుత్వానికి మధ్య గత కొన్ని రోజుల నుంచి సఖ్యత లేని విషయం తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ సైతం ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రులు కూడా ఆమెపై పలు వ్యాఖ్యలు చేయడం ఇటీవల దుమారం రేగింది. ఇది గవర్నర్, గవర్నమెంట్ మధ్య ఉన్న గ్యాప్ను మరింత పెంచినట్లు కనిపించింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్.. వ్యక్తిగతంగా తనను అవమానించినా, రాజ్యాంగపరంగా గవర్నర్ పదవికి మర్యాద ఇవ్వాలని సూచించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం ఆసక్తికరంగా మారింది.
గవర్నర్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలాఉంటే.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, జన్మదిన వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో కేక్ కట్ చేసి మట్లాడారు. ఈ రాష్ట్రం నాది.. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్ను మాత్రమే కాదు.. మీ సహోదరిని అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు సేవ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు అవకాశం కల్పించారన్నారు. రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాను. అయినా.. నేను బాధపడను.. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు నా సేవలను అందిస్తూనే ఉంటానని ప్రకటించారు. తాను రాష్ట్రానికి గవర్నర్ని కాదు.. మీ అందరి సహోదరిని.. ఎవరు ఆపినా సేవలు అందిస్తానని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..