గుమ్మడికాయలను నైవేద్యంగా స్వీకరించే అరుదైన దేవాలయం.. తెలుగు రాష్ట్రంలోనే ఎక్కడ ఉందంటే..?
Pumpkin offering temple: ఒక్కో ఆలయంలో ఒక్కో పూజ విధానం ఉంటుంది. అక్కడి దేవతకు ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెడుతుంటారు భక్తులు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో కొలువైన వీరభద్రస్వామి ఆలయంలో చాలా ప్రత్యేకమైన నైవేద్యం సమర్పిస్తారు. ఇప్పుడు తెలంగాణలోని ఈ ప్రత్యేక దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం.

Veerabhadraswami Temple: దేశంలో అనేక హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో చరిత్ర, ప్రత్యేక ఉంటాయి. అవి వాటి స్థానిక నమ్మకాలతో ప్రసిద్ధి చెందుతాయి. దీంతో ఇలాంటి ప్రత్యేకమైన ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని పూజలు చేస్తుంటారు. తమ కోరికలు తీర్చాలంటూ ఆ ఆలయంలో కొలువైన దేవతామూర్తిని వేడుకుంటారు. అయితే, ఒక్కో ఆలయంలో ఒక్కో పూజ విధానం ఉంటుంది. అక్కడి దేవతకు ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెడుతుంటారు భక్తులు. ఇప్పుడు తెలంగాణలోని ఓ ప్రత్యేక దేవాలయాన్ని గురించి తెలుసుకుందాం. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో కొలువైన వీరభద్రస్వామి ఆలయంలో చాలా ప్రత్యేకమైన నైవేద్యం సమర్పిస్తారు. అక్కడ అలాంటి నైవేద్యం సమర్పించడంలో చారిత్రక కారణాలున్నాయి.
వీరభద్రుడికి గుమ్మడి కాయల నైవేద్యం
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో భక్తులు అతిపెద్ద రాస గుమ్మడికాయను స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు.. కోటీశ్వరుడైనా లేదా పేదవాడైనా.. కొత్తకొండ ఆలయం వద్ద గుమ్మడి కాయలను పట్టుకుని పొడవైన క్యూలో వేచి ఉండాల్సిందే. గుమ్మడికాయలను నైవేద్యంగా సమర్పించి తమ కోరికలు నెరవేర్చాలంటూ భక్తులు వీరుభద్రుడిని వేడుకుంటారు. సామాన్య భక్తులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా వీరభద్రుడి ఆలయానికి వచ్చి గుమ్మడి కాయలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. పండగల సందర్భంలో వేలాది మందికిలు స్వామివారిని దర్శించుకుంటారు.
గుమ్మడి కాయలను సమర్పించడం వెనుక..
పురాణాల్లో.. గుమ్మడికాయకు పెద్ద చరిత్రే ఉంది. దక్ష యజ్ఞం సమయంలో వీరభద్రుడు.. దక్ష రాజు తలని అతని శరీరం నుంచి నరికివేశాడు. ఆ తర్వాత వీరభద్రుడిని శాంతపర్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. చివరకు ఆయనను శాంతపర్చడానికి రాస గుమ్మడికాయ (కూష్మాండం)ను నైవేద్యంగా సమర్పించారు. దీంతో ఆయన శాంతించారు. ఈనేపథ్యంలోనే అప్పటి నుంచి వీరభద్రుడికి గుమ్మడికాయలను నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా మారింది. గుమ్మడికాయలను సమర్పించడంతో వీరభద్రుడి సంతోషిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే గుమ్మడికాయలను సమర్పించి వీరభద్రుడి ఆశీస్సులు తీసుకుంటారు భక్తులు. పోలీసులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా వీరభద్రుడి ఆశీస్సుల కోసం గుమ్మడికాయలను తీసుకొచ్చి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో ఆలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున గుమ్మడికాయలను విక్రయిస్తుంటారు స్థానిక వ్యాపారులు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం అందుబాటులో ఉన్న వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించదు.)
