Siddipet: ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేస్తున్న విద్యార్థినిలు.. చదువుకోడానికి అనుకుంటే పొరపాటే
తమ బిడ్డలు మంచి చదవులు చదవుకోవాలని.. వాళ్లు ఉన్నత స్థానాలకి వెళ్లాలని ప్రభుత్వ గురుకులాల్లో జాయిన్ చేస్తారు తల్లిదండ్రులు. అయితే వారి ఆలనా పాలనా చూడాల్సిన టీచర్స్, వార్డెన్స్ మాత్రం పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో తాజాగా అలాంటి ఘటన వెలుగుచూసింది.

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలకు చేర్చాల్సిన టీచర్స్.. అదే పిల్లలతో వెట్టిచాకిరి చేపిస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా కొంతమంది ఉపాధ్యాయుల బుద్ధి మారడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఆ గురుకుల హాస్టల్లో పిల్లలు తెల్లవారు జామున నాలుగు గంటలకే నిద్ర లేస్తారు.. చదువుకోడానికి అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే. చదువు పక్కన పెట్టి మరీ చపాతీలు చేస్తారు. చపాతీలు ఒకటో రెండో అనుకునేరు. 670 మంది పిల్లలకు చపాతీలు చేస్తూ ఇక్కడి బాలికలు కూలీల్లా మారారు.
అక్కడ చదువుకునే విద్యార్థినిలచే ప్రతి ఆదివారం ఇలానే చేపిస్తారని ఏ సెక్షన్, బి సెక్షన్ అని వంతులు వారిగా చపాతీలు చేపిస్తున్నారని కొందరు బాలికలు బాధపడుతున్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్ పల్లిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల హాస్టల్లో ఈ తంతు సాగుతోంది. దీనిపై ప్రిన్సిపాల్ మార్తను వివరణ అడగగా తన ఆరోగ్యం బాలేదని.. హాస్టల్లో ఏం జరుగుతుందో తెలియదని వివరణ ఇవ్వడం గమనార్హం .తమ పిల్లల చదువుల కోసం వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సుదూర ప్రాంతాలను సైతం లెక్క చేయకుండా.. ఇలా హాస్టల్లో జాయిన్ చేయిస్తే.. వారితో ఇలా వెట్టి చాకిరి చేయించడం ఎంతవరకు సమంజసం అని.. ఉన్నతాధికురులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్ధినిల తల్లితండ్రులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
