Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇకపై తక్కువ ధరకే స్టీల్, సిమెంట్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రెండో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్ల మంజూరుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని స్టీల్, సిమెంట్ పరిశ్రమలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగం కావాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వం,పరిశ్రమలు, ప్రజలు కలిసి పనిచేస్తే గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యం సాధ్యమవుతుందని తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని స్టీల్, సిమెంట్ పరిశ్రమలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. పేదల ఇళ్ల నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని స్టీల్, సిమెంట్ ధరలను తగ్గించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశ్రమల యాజమాన్యాలను కోరారు. సచివాలయంలో గురువారం వివిధ స్టీల్, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులతో మంత్రులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల వంద శాతం సబ్సిడీతో పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందని తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, నిర్మాణ పురోగతికి అనుగుణంగా ప్రతి సోమవారం నిధులను విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ విజ్ఞప్తిపై పరిశ్రమల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని, తక్కువ ధరకే స్టీల్, సిమెంట్ అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారని మంత్రులు వెల్లడించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తేనే గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యం సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.
వేగంగా సాగుతున్న ఇళ్ల నిర్మాణం
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, మూడో, నాలుగో విడతల్లోనూ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రులు వివరించారు. ఇప్పటివరకు తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని.. ఇందులో ఇప్పటికే 85 శాతం ఇళ్ల శ్లాబ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయన్నారు.
త్వరలో రెండో దశ
త్వరలోనే రెండో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా మరో 2.50 లక్షల ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని మంత్రులు తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో అదనంగా మరో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గిరిజన నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, అక్కడ అదనంగా 1,000 నుంచి 1,500 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రులు ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




