IND vs SL : అక్కడ సీనియర్స్.. ఇక్కడ జూనియర్స్.. సిరీసుల్లో చేతులెత్తేస్తున్న భారత క్రికెటర్లు
IND vs SL : శ్రీలంక అండర్-19తో జరిగిన యూత్ వన్డే సిరీస్ను భారత్ 1-2తో కోల్పోయింది. చివరి మ్యాచ్లో 291 పరుగుల లక్ష్యాన్ని లంక జట్టు చివరి బంతికి ఛేదించి ఒక వికెట్ తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది.

IND vs SL : భారత క్రికెట్ అభిమానులకు మరో చేదు వార్త ఎదురైంది. సీనియర్ జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు జూనియర్ జట్టు కూడా అదే బాటలో నడిచింది. శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్ను భారత అండర్-19 జట్టు 1-2 తేడాతో కోల్పోయింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో, చివరి వన్డే మ్యాచ్లో శ్రీలంక యువ జట్టు అద్భుత ప్రదర్శనతో భారత్కు గట్టి షాక్ ఇచ్చింది. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో శ్రీలంక 1 వికెట్ తేడాతో విజయం సాధించి సిరీస్ను తన సొంతం చేసుకుంది.
ఈ కీలకమైన చివరి మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక అండర్-19 జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత ఇన్నింగ్స్లో నంబర్ త్రీ బ్యాటర్ వికే వినీత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆయన కేవలం 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనికి తోడుగా లక్ష్య రాజేష్ రాయ్చందానీ 61 పరుగులతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో సెథమిక సెనెవిరత్నె అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్ను కట్టడి చేశాడు.
291 రన్స్ కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. లంక జట్టు గెలవడానికి ఆఖరి ఓవర్లో 11 పరుగులు కావాలి. క్రీజులో ఉన్న చమిక హీనాతిగాల మొదటి బంతిని డాట్ చేశాడు. కానీ రెండో బంతికి ఫోర్ కొట్టి టెన్షన్ తగ్గించాడు. ఆ తర్వాత మూడు మరియు నాలుగో బంతులు మళ్లీ డాట్ అవ్వడంతో భారత జట్టు విజయం ఖాయమనుకున్నారు. కానీ ఐదో బంతికి చమిక భారీ సిక్సర్ బాదడంతో మ్యాచ్ టై అయింది. ఇక ఆఖరి బంతికి 1 రన్ కావాల్సి ఉండగా, ఆయన సింగిల్ తీసి లంక జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు.
శ్రీలంక ఇన్నింగ్స్లో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన చమిక హీనాతిగాల 68 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి మ్యాచ్ విన్నర్గా మారాడు. ఆయనతో పాటు సెనూజ వెకునాగోడ 67 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత బౌలర్లలో అన్మోల్జీత్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసినప్పటికీ, జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఈ విజయంతో శ్రీలంక జట్టు సంబరాల్లో మునిగిపోయింది.
నిజానికి ఈ సిరీస్ను భారత్ ఎంతో ఘనంగా ప్రారంభించింది. మొదటి యూత్ వన్డే మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత శ్రీలంక జట్టు పుంజుకుని వరుసగా తదుపరి రెండు వన్డేల్లోనూ భారత్ను ఓడించి సిరీస్ను 2-1 తో ముగించింది. వన్డే సిరీస్ ముగియడంతో, ఈ రెండు జట్ల మధ్య త్వరలోనే రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులోనైనా భారత్ పుంజుకుంటుందో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
