బరితెగించిన ప్రైవేట్ కాలేజీలు.. ఫేక్ సర్టిఫికెట్లతో అఫిలియేషన్కు యత్నం!
రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అఫిలియేషన్ కోసం నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు వెలుగులోకి రావడంతో ఇంటర్మీడియట్ విద్యామండలి అంతర్గత విచారణను ప్రారంభించింది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత కళాశాలలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది..

హైదరాబాద్, ఆగస్ట్ 6: తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అఫిలియేషన్ పొందేందుకు కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఏకంగా నకిలీ ఫైర్ ఎన్ఓసీలను సమర్పించినట్లు తేలింది. పత్రికలు, దృశ్య మాధ్యమాల్లో వచ్చిన కథనాల ఆధారంగా అలర్ట్ అయిన తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఫేక్ సర్టిఫికెట్లతో బోర్డును మభ్యపెట్టాలని చూసిన సదరు కళాశాలల తీరుపై ఇంటర్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నకిలీ ఫైర్ ఎన్ఓసీల ముఠా గుట్టు తేల్చేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే అంతర్గత విచారణను వేగవంతం చేసింది. విచారణ పూర్తయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు తేలితే సదరు కళాశాలలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది. చెల్లుబాటు అయ్యే గుర్తింపు లేకుండా లేదా బోర్డు నిర్దేశించిన నియమ నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్న ఏ ఒక్క కళాశాలనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఫైర్ డిపార్ట్మెంట్, ఇతర సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో పూర్తి సమన్వయంతో పూర్తిస్థాయి పరిశీలన జరుపుతోంది.
మరోవైపు ఈ వ్యవహారంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న ధృవీకరించని వార్తలు, పుకార్లను నమ్మి గందరగోళ పడవద్దని సూచించింది. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమాన్ని కాపాడటంతో పాటు అఫిలియేషన్ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనానికి తాము కట్టుబడి ఉన్నామని బోర్డు తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటనలు, వెబ్సైట్లోని సమచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది.




