కోకాపేట నియోపోలిస్లో ఆల్ టైం రికార్డు.. ఎకరం ఏకంగా రూ.151.25 కోట్లు!
రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలోరోసారి భూములకు రికార్డు ధర లభించింది. నియోపోలిస్ లేఅవుట్లో హెచ్ఎండీఏ నిర్వహించిన తాజా ఈ–వేలంలో ఎకరా ధర ఏకంగా రూ.151.25 కోట్ల గరిష్టానికి చేరి సంచలనం సృష్టించింది. ఫ్లాట్ నంబర్లు 15, 16 కలిపి మొత్తం 9.06 ఎకరాలకు జరిగిన ఈ వేలం ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం తెచ్చింది..

రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలోరోసారి భూములకు రికార్డు ధర లభించింది. నియోపోలిస్ లేఅవుట్లో హెచ్ఎండీఏ నిర్వహించిన తాజా ఈ–వేలంలో ఎకరా ధర ఏకంగా రూ.151.25 కోట్ల గరిష్టానికి చేరి సంచలనం సృష్టించింది. ఫ్లాట్ నంబర్లు 15, 16 కలిపి మొత్తం 9.06 ఎకరాలకు జరిగిన ఈ వేలం ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం తెచ్చింది. ప్లాట్ నెం. 15 (4.03 ఎకరాలు)లో ఎకరాకు రూ.151.25 కోట్లు బిడ్ రాగా.. ప్లాట్ నెం.16 (5.03 ఎకరాలు)లో ఎకరా ధర రూ.147.5 కోట్ల వద్ద ఆగింది. మొత్తం మీద ఈ రెండు ప్లాట్ల ద్వారానే ప్రభుత్వం సుమారు రూ.1353 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సందర్భంగా HMDA ముందుగా నిర్దేశించిన రూ.99 కోట్ల ప్రారంభ ధరను బిడ్డర్లు బాగా మించేలా పోటీ పడటం విశేషం. వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు సాగింది. బిడ్డర్లు ధరను పరుగులు పెట్టించిన ఈ పోటీలో ప్లాట్–15ను లక్ష్మీనారాయణ కంపెనీ, ప్లాట్–16ను గోద్రేజ్ ప్రాపర్టీస్ సొంతం చేసుకున్నాయి.
ఇదే లేఅవుట్లో ఈ నెల 24న 18వ ప్లాట్లో ఎకరాకు రూ.137.25 కోట్లు పలికిన విషయం తెలిసిందే. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సంఖ్యను 14 కోట్లు అధిగమించి కొత్త రికార్డు నమోదు అయింది. ఇదే నియోపోలిస్లోని 19, 20 నంబరు ప్లాట్లలో ఉన్న మరో 8 ఎకరాలకు డిసెంబర్ 3న వేలం జరగనుంది. ప్రతి బిడ్డర్ కనీసం రూ.5 కోట్ల అప్లికేషన్ భద్రతా డిపాజిట్ జమ చేయాలి. వేలంలో విజయం సాధిస్తే, ఒక వారం రోజుల్లో 25%, తదుపరి 60 రోజుల్లో మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది అని హెచ్ఎండీఏ స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఇటీవలే హెచ్ఎండీఏ పరిధిలోని ప్రీమియం భూములను ఆన్లైన్ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆగస్టులో రాయదుర్గంలోని 7.67 ఎకరాలు రూ.1,357 కోట్లకు అమ్ముడవడం, ఎకరాకు ఏకంగా రూ.177 కోట్లు నమోదు కావడం పెద్ద సంచలనం. అదే ధోరణిలో కోకాపేటలో ఈసారి ప్లాట్లు 16 నుంచి 19 వరకూ 27 ఎకరాలు వేలానికి రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఎకరాకు రూ.150 కోట్లకుపైనే పలుకుతుందని భావించిన మార్కెట్ అంచనాలు యధార్ధమైపోయాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




