AP News: చోరి సొమ్ము వాటాల పంపిణీలో బెడిసిన యవ్వారం.. గ్యాంగ్ లీడర్ హత్య!
మార్చి నాలుగో తేదిన పెదకాకాని రైల్వే స్టేషన్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి హత్య జరిగింది. స్టేషన్ లోని ప్లాట్ ఫాం చివరన గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రాధమిక ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ దర్యాప్తులో హత్యకు గురైన వ్యక్తి.. చంపిన నిందితులు అంతా ఒకే గ్యాంగ్ కు చెందిన వారుగా గుర్తించారు. హత్య నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే..

గుంటూరు, మార్చి 12: కేరళకు చెందిన పరమడం అనీష్ అలియాస్ బ్లేడ్ తిరుపతిలో సెటిల్ అయ్యాడు. బ్లేడ్ కి తమిళనాడుకు చెందిన కుమార్ కేరళకు చెందిన దీపేష్, అనంతపురానికి చెందిన వెంకటేష్ స్నేహితులు.. వీరంతా కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడ్డారు. రైల్వే స్టేషన్స్ లో చోరికి పాల్పడటం ఈ గ్యాంగ్ పని. అయితే వీరికి నాయకుడైన అనీష్ దొంగతనం చేసే సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై బ్లేడ్ తో అటాక్ చేసేవాడు. అందుకే గ్యాంగ్ లీడర్ కి బ్లేడ్ అన్న పేరు వచ్చింది. ప్రయాణీకుల జేబులు కత్తిరించడం, చోరి చేయడం.. అలా వచ్చిన డబ్బులను పంచుకోవడం చేసేవారు. అయితే గ్యాంగ్ లీడర్ గా ఉన్న బ్లేడ్ చోరి సొమ్ములో అధిక మొత్తం తనకే ఇవ్వాలంటూ ముఠా సభ్యులపై గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. అంతే కాకుండా చోరి చేయగా వచ్చిన వాటిల్లో పెద్ద మొత్తాన్ని బెదిరించి తీసుకుంటున్నాడు. ఇలా ముఠా సభ్యులపైనే దౌర్జన్యానికి దిగడంతో మిగిలిన ముగ్గురు ఒక్కటయ్యారు. ఎలాగైనా బ్లేడ్ అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేశారు.
మార్చి నాలుగో తేదిన ముగ్గురు కలిసి గుంటూరు వచ్చారు. బ్లేడ్ గుంటూరులో ఉన్నాడని తెలుసుకొని అతనితో సంప్రదింపులు జరిపారు. అందరం కలిసి మద్యం సేవిద్దామంటూ పెదకాకాని వెళ్లారు. అక్కడ మద్యం సేవించారు. అనంతరం పెదకాకాని రైల్వే స్టేషన్ లోకి వెళ్లారు. బ్లేడ్ మద్యం మత్తులో ఉండటంతో మిగిలిన ముగ్గురు కలిసి అతనిపై దాడి చేశారు. బండరాయితో తలపై మోది ఆ తర్వాత అతని గొంతు కోసి హత్య చేసి అక్కడ నుండి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా విజువల్స్, ఫోన్ కాల్స్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.

మొదట బ్లేడ్ ను బీహర్ కు చెందిన వ్యక్తిగా భావించిన పోలీసులు పోన్ కాల్స్ ఆధారంగా చిక్కుముడి విప్పుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టు ముందుంచారు. చోరి సొత్తు పంపకాల్లో వచ్చిన తేడా కారణంగానే బ్లేడ్ ను హత్య చేసినట్లు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరావు తెలిపారు. చాకచక్యంగా కేసును చేధించిన పోలీసులను ఆయన అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




