Teachers MLC Election: టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ముందంజ.. భారీగా చెల్లని ఓట్లు..
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది.

మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి ముందంజలో దూసుకెళ్తున్నారు. గురువారం సాయంత్రం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏవీఎన్ రెడ్డి 7,505 ఓట్లతో ముందంజలో ఉండగా.. పీఆర్టీయూ బలపర్చిన అభ్యర్థి చెన్నకేశవరెడ్డి 6584 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మాణిక్ రెడ్డి 4569 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో PRTU అభ్యర్థి చెన్నకేశవ రెడ్డిపై AVN రెడ్డి 921 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 12,709. అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపు నిర్ధారణ కాకపోవడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
అయితే, మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి లకు భారీగా ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో.. తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేషన్ చేయనున్నారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 21 మంది అభ్యర్థులు ఉన్నారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. టీచర్లకు సరిగా ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ MLC ఎన్నికల్లో చెల్లని ఓట్లు 452 నమోదయ్యాయి. దాదాపు 2 వేల వరకు చెల్లని ఓట్లు నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.





Mlc
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
