AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీమలో పెద్ద మనుషుల ఒప్పందం…

చరిత్రలో కొన్ని పుటలకు ప్రాధాన్యత ఎక్కువ. అందులోను కీలకాంశాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. తరాలు మారినా తలరాతలు మారినా గత చరిత్ర మారదు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరగొచ్చు. కానీ వాస్తవం పోదు. అలాంటిదే శ్రీబాగ్ ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందం అని ముద్దుగా పిలుచుకుంటాం. అది జరిగి 80 ఏళ్లు పూర్తి అయింది. తమకు జరుగుతున్న వివక్షత నుంచి బయట పడేందుకు కోస్తాంధ్ర, రాయలసీమ నేతలు చేసుకున్న ఒడంబడికే ఈ శ్రీబాగ్. ఇప్పటికీ అదే ఒప్పందాన్ని […]

సీమలో పెద్ద మనుషుల ఒప్పందం...
Siva Nagaraju
| Edited By: |

Updated on: Jan 05, 2020 | 2:12 PM

Share

చరిత్రలో కొన్ని పుటలకు ప్రాధాన్యత ఎక్కువ. అందులోను కీలకాంశాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి. తరాలు మారినా తలరాతలు మారినా గత చరిత్ర మారదు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరగొచ్చు. కానీ వాస్తవం పోదు. అలాంటిదే శ్రీబాగ్ ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందం అని ముద్దుగా పిలుచుకుంటాం. అది జరిగి 80 ఏళ్లు పూర్తి అయింది. తమకు జరుగుతున్న వివక్షత నుంచి బయట పడేందుకు కోస్తాంధ్ర, రాయలసీమ నేతలు చేసుకున్న ఒడంబడికే ఈ శ్రీబాగ్. ఇప్పటికీ అదే ఒప్పందాన్ని అమలు చేయాలని రాయలసీమ వాసులు కోరుతుండటం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.

శ్రీబాగ్ ఒప్పందం…

మద్రాసులో తెలుగు వారిని చిన్న చూపు చూసేవాళ్లు. హస్తినలోనే దక్షిణాది వారంటే అలుసుగా ఉండేది. అందులోను కోస్తాంధ్ర, రాయలసీమ వారంటే ఎందుకు పనికిరారన్నట్లుగా వారి ఆలోచనలు ఉండేవి. అందుకే చైన్నై నుంచి వేరు కావాలని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలతో కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ బ్రిటిష్ పాలకుల హయాంలోనే జరిగింది. స్వాతంత్ర్యానికి పూర్వమే మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారు వివక్షకు గురయ్యారు. ఫలితంగా పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలు, విభేదాలను తొలగించడానికి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్నే శ్రీబాగ్ ఒడంబడిక అంటాం. 1937 నవంబర్ 16న ఈ ఒప్పందం జరిగింది. కోస్తాంధ్ర ఆధిపత్య వర్గాల నుంచి తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని రాయలసీమ వాసులు భావించారు. అందుకే తమకు ప్రత్యేకమైన రక్షణలు కావాలని వారు పట్టుబట్టారు. చివరకు అది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుగా నిలిచింది. ఫలితంగా రాయలసీమ నాయకులను ఒప్పించడానికి కీలక ఒప్పందం జరిగింది.

విస్తీర్ణం ఆధారంగా పంపకాలు…

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చెయ్యాలనే విషయం పై 1926లోనే రెండు ప్రాంతాల నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి డా. సుబ్బారాయన్‌ తీసుకున్న నిర్ణయాలే వివాదానికి ఆజ్యం పోశాయి. ఆ తర్వాత 1913-1935 వరకు జరుగుతూ వచ్చిన ఆంధ్ర మహాసభ సమావేశాలలోను వివాదాలు జరిగాయి. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ ఎన్నికలలోను ఇవి బయటపడ్డాయి. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశాలలో ప్రత్యేకాంధ్ర తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మద్రాసు నుంచి తెలుగువారి బయటకు రావడమే దీని ఉద్దేశ్యం. ఈ తీర్మానాన్ని ఓడించడానికి రాయలసీమ, నెల్లూరు ప్రతినిధులు తమ వంతు ప్రయత్నాలు చేశారు.1924లో విజయవాడలో జరిగిన ఆంధ్ర కాంగ్రెసు కమిటీ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీచేసిన రాయలసీమకు చెందిన నాయకుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావును ఆంధ్ర నాయకులు ఓడించారు. ఫలితంగా రాయలసీమ నేతలు భయపడ్డారు. తమ రాజకీయ నాయకత్వంలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండటం, వారు సహజంగానే ప్రత్యేకాంధ్రకు వ్యతిరేకంగా ఉండటం మరో కారణం.

1937లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభ రజతోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సభలో పాల్గొన్న నాయకులు ఇరు ప్రాంతాల మధ్య ఉన్న విభేదాలను తొలగించుకోవాలని నిర్ణయించారు. మంత్రివర్గం ఏర్పాటు, నీటిపారుదల, రాజధాని ఏర్పాటు మొదలైన విషయాలలో రాయలసీమకు రక్షణలు అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాయలసీమ నేతలు. ఈ అంశాలను పరిశీలించేందుకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా భోగరాజు పట్టాభి సీతారామయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, హాలహర్వి సీతారామరెడ్డి, కడప కోటిరెడ్డి, కొండా వెంకటప్పయ్య, టి.ఎన్.రామకృష్ణారెడ్డి, మహబూబ్‌ ఆలీ బేగ్‌, దేశిరాజు హనుమంతరావు, కల్లూరు సుబ్బారావు, దేశపాండ్య సుబ్బారావు, వరదాచారి, పప్పూరి రామాచారి, సుబ్బరామిరెడ్డి, ముళ్ళపూడి పల్లంరాజులు వ్యవహరించారు. ఈ సంఘ సభ్యులంతా 1937 నవంబర్‌ 16న మద్రాసులో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్‌లో సమావేశమమయ్యారు. ఒక ఒప్పందానికి వచ్చారు.

కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం…

ఇంటి పేరుమీదనే చారిత్రాత్మక ఒప్పందానికి శ్రీబాగ్ ఒడంబడిక అనే పేరు వచ్చింది. శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వం కోసం విద్యా కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద అనంతపురంలో ఒక కేంద్రం ఏర్పాటు. సాగునీటిపారుదల రంగంలో వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతంతో సమానమయ్యే వరకు నీళ్లు ఇవ్వాలి. సాగునీటి సరఫరా విషయంలో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి. శాసనసభ స్థానాలు జనాభా ప్రాతిపదికన కాక, ప్రాంత విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించాలి. రాయలసీమలో జనసాంద్రత కోస్తా కంటే తక్కువ కావడం వలన ఈ ప్రతిపాదన వచ్చింది. రాజధాని రాయలసీమలో ఉంటే హైకోర్టు ఆంధ్రా ప్రాంతంలో, హైకోర్టు రాయలసీమలో ఉంటే రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉండాలి. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. అదే సమయంలో ఒకటే కోరుకోవాలి. ఆ శ్రీబాగ్ ఒడంబడిక మేరకే కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని అయింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తుండగా…కోస్తాంధ్రలోని గుంటూరు జిల్లాలో గల ఆంధ్రుల నగరి అమరావతిని ఇందుకు ఎంపిక చేశారు. అదే సమయంలో రాయలసీమలో మరో రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెర ముందుకు వచ్చింది.

ఒప్పందం అమలు చేయాలనే డిమాండ్…

ఉమ్మడి మద్రాసులో 1937లో నవంబర్‌ 16న ఎనిమిది మంది సభ్యుల సమక్షంలో జరిగిన శ్రీబాగ్‌ ఒడంబడిక చరిత్రలో స్ఫూర్తిదాయకమైన సంఘటన. శ్రీ బాగ్‌ ఒప్పందం మేరకు రాయలసీమకు నికరజలాలు, పెండింగ్‌ ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణ, ప్రభుత్వ విద్య, వైద్యం, విభజన హామీల అమలు, హైకోర్టు, స్పెషల్‌ ప్యాకేజీ అంశాలపై ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. శ్రీబాగ్‌ ఒప్పందంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నా రాయలసీమ హక్కులు, ప్రయోజనాలను అడగడంలో వెనుకబాటుతనం ఉందనే వాదనుంది. శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు సీమ ప్రయోజనాలు, హక్కులపై మేధోమథనం జరగాలనే అభిప్రాయం ఉంది. మన హక్కులను పరిరక్షించుకోవాలని, సీమకు జరిగిన నష్టం పూరించాలంటే అన్ని వర్గాల ప్రజలూ ఏకమై బలమైన ఉద్యమం చేయాలని వాదన లేకపోలేదు.

నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు మూడు రాజధానుల అంశం తెరపైకి రావడంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకుంది. విశాఖలో సెక్రటేరియేట్, ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ శాఖలు, అత్యవసర సమావేశాలు కోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, ఏర్పాటుచేయాలని, కర్నూలులో హైకోర్టు, రాష్ట్ర కమిషనర్ కార్యాలయం, అప్పిలేట్ సంస్ఠలు ఏర్పాటు చేస్తారనే చర్చ సాగుతోంది. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి అన్నిచోట్ల జరుగుతుందనేది అక్షర సత్యం. కానీ అదే సమయంలో ఉన్న ఫలంగా రాజధాని తరలింపు జరగడంతో అమరావతిలో నిరసన సెగలు రేగుతున్నాయి. రాజధాని కోసం తమ భూములిచ్చిన రైతులు తమ సంగతేంటనే ప్రశ్నిస్తున్నారు. సిఎం జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకుంది. కర్నూలు కేంద్రంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని, పలు ప్రభుత్వ శాఖలను నెలకొల్పాలని పలు కమిటీలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలిచ్చాయి.

అంతా అమరావతిలో కేంద్రీకృతం కాకుండా మిగతా ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాలనే వాదనుంది. హైదరాబాద్ ను అలానే అభివృద్ధి చేసి విభజన తర్వాత పూర్తిగా వదులుకోవాల్సి వచ్చింది. దీనికి విలువ కట్టలేమన్నది వావస్తం. అమరావతి రాజధానిని విశాఖపట్నంకు మార్చాలనే ప్రతిపాదన రావడమే ఆలస్యం రాయలసీమ నేతలు తమ స్వరం పెంచారు. పార్టీలకతీతంగా వారు మాట్లాడుతున్న తీరు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. కర్నూలు లేక చిత్తూరును రాజధానిగా చేయండి. లేకపోతే మా ప్రాంతాన్ని కర్నాటకలో కలిపేయండని ప్రజా ప్రతినిధులు కోరడం చర్చనీయాంశమైంది. మరికొందరైతే రాయలసీమను తమిళనాడులో కలిపేయాలని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. తొలిగా మద్రాసు..ఆ తర్వాత కర్నూలు…అక్కడ నుంచి హైదరాబాద్ కు..కొన్నాళ్ల తర్వాత అమరావతికి…ఇప్పుడు విశాఖకు ఇలా రాజధానులు మారుతున్నాయి. కానీ తమ తలరాతలు మారడం లేదని పాలెగాళ్ల కాలం నుంచి ఇదే పరిస్థితి ఉందంటున్నారు సీమ వాసులు. అందుకే మరోసారి రాయలసీమకు అన్యాయం జరగకుండా ఏలికలు చూస్తే పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేయాలనే డిమాండ్ రాదు.

కొండవీటి శివనాగరాజు సీనియర్ జర్నలిస్టు

Follow Us