Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్.. వివరణ ఇచ్చేందుకు నేటి మద్యాహ్నం వరకు గడువు..

ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘన కింద తెలంగాణ విద్యుత్తు శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన..

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్.. వివరణ ఇచ్చేందుకు నేటి మద్యాహ్నం వరకు గడువు..
Minister Guntakandla Jagadish Reddy
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 29, 2022 | 7:42 AM

ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘన కింద తెలంగాణ విద్యుత్తు శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈ నోటీసులు జారీచేసింది. ఈ నెల 25వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నాయకుడు కపిలవాయి దిలీప్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా ఎన్నికల అధికారులు కూడా మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన నోట్ ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. వీటిని పరిశీలించిన ఎన్నికల సంఘం ప్రాథమికంగా మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. దీనిపై అక్టోబర్ 29వ తేదీ (శనివారం) మద్యాహ్నం 3 గంటల్లోగా వివరణ ఇవ్వాలని.. లేకపోతే తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులో కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఈ నెల 25వ తేదీన ప్రచారంలో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి.. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే అర్ధం వచ్చేలా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావాలంటే కేసీఆర్ కు టీఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయాలని, పథకాలు వద్దనుకుంటే మోదీకి వేయాలంటూ ఆయన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందో తేల్చుకోవాలన్నారు.

తెలంగాణ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తేనే సంక్షేమ పథకాలు వస్తాయని, లేకపోతే రావనేలా మాట్లాడటం కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పిర్యాదు చేశారు. మంత్రి ఓటర్లను బెదిరించేలా మాట్లాడారని ఆరోపించారు. అయితే మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని టీఆర్ ఎస్ నాయకులు చెబుతున్నారు. అయితే సీఈసీ నోటీసులపై మంత్రి ఎలాంటి వివరణ ఇస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..