NIMS Hyderabad: ఛాతీలో దిగిన బాణంతో 24 గంటలపాటు నరకం.. ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన నిమ్స్ వైద్యులు
హైదరాబాద్ నిమ్స్ సర్జన్లు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ గిరిజన యువకుడి ప్రాణాలు కాపాడారు. ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు 24 గంటలపాటు విలవిలలాడుతూ నరకయాతన అనుభవించిన గిరిజన యువకుడికి నిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేసి, బాణం తొలగించారు. కార్డియోథొరాసిక్ విభాగానికి చెందిన సర్జన్లు నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేసి అతడిని రక్షించారు. నిమ్స్ డైరెక్టర్ డా బీరప్ప, కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్..
హైదరాబాద్, మే 26: హైదరాబాద్ నిమ్స్ సర్జన్లు అరుదైన శస్త్ర చికిత్స చేసి ఓ గిరిజన యువకుడి ప్రాణాలు కాపాడారు. ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు 24 గంటలపాటు విలవిలలాడుతూ నరకయాతన అనుభవించిన గిరిజన యువకుడికి నిమ్స్ వైద్యులు ఆపరేషన్ చేసి, బాణం తొలగించారు. కార్డియోథొరాసిక్ విభాగానికి చెందిన సర్జన్లు నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేసి అతడిని రక్షించారు. నిమ్స్ డైరెక్టర్ డా బీరప్ప, కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్ హెడ్ డా అమరేశ్వరరావు, సీనియర్ వైద్యుడు డా గోపాల్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం..
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపుర్ జిల్లా ఊసూర్ ప్రాంతానికి చెందిన సోది నంద (17) అనే గుత్తికోయ తెగకు చెందిన యువకుడికి గురువారం సమీపంలోని అడవిలోకి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు బాణం అతని ఛాతీలో దిగింది. కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహామేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సెన్సిటివ్ కేసు కావడంతో అక్కడి వైద్యులు హైదరాబాద్ నిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో శుక్రవారం సాయంత్రం నాటికి యువకుడిని పంజాగుట్టలోని నిమ్స్కు తరలించారు. వైద్యులు తొలుత సీటీస్కాన్ తీయగా. ఊపిరితిత్తుల పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం దిగినట్లు గుర్తించారు. అప్పటికే అధికంగా రక్తస్రావంకాడంతో.. ఓవైపు రక్తం ఎక్కిస్తూనే 4 గంటలపాటు ఆపరేషన్ చేసి బాణాన్ని తొలగించారు. బాణం దిగిన చోట రక్తస్రావమై గడ్డకట్టడంతో ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. ఒకవేళ ఆ యువకుడు సొంతంగా బాణాన్ని తీసే ప్రయత్నం చేసి ఉంటే మరింత రక్తస్రావమై పరిస్థితి మరింత చేజారిపోయేదని వారు వివరించారు.
మానవీయ కోణంలో ఈ ఆపరేషన్ పూర్తి ఉచితంగా చేసి, చికిత్స అందించినట్లు తెలిపారు. కోలుకున్న తర్వాత డిశ్ఛార్జి చేస్తామని చెప్పారు. క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన కార్డియోథొరాసిక్ సర్జన్ల బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ అభినందించారు. దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించి నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.