CM Revanth: యాదాద్రి పవర్ ప్లాంట్ పనులపై దృష్టి సారించిన ప్రభుత్వం..
రాష్ట్రంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే అధికార యంత్రాంగం మాత్రం విద్యుదుత్పత్తి ప్రారంభించే దిశగా సన్నాహాలు చేస్తోంది. వైటీపీఎస్లో కీలకమైన ప్రజాభిప్రాయసేకరణ కూడా పూర్తవడంతో పనులు వేగవంతం చేయాలని జెన్కో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

రాష్ట్రంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే అధికార యంత్రాంగం మాత్రం విద్యుదుత్పత్తి ప్రారంభించే దిశగా సన్నాహాలు చేస్తోంది. వైటీపీఎస్లో కీలకమైన ప్రజాభిప్రాయసేకరణ కూడా పూర్తవడంతో పనులు వేగవంతం చేయాలని జెన్కో ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. యాదాద్రి పవర్ ప్లాంట్లో సెప్టెంబరు నాటికి రెండు యూనిట్లు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసి మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ (YTPS) నిర్మాణాన్ని చేపట్టింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో YTPS నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు యూనిట్లకు జూన్ 26, 2017న కేంద్ర పర్యావరణ శాఖ అనుమతినిచ్చింది. అదే ఏడాది అక్టోబరు 17న రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో జెన్ కో నిర్మాణం ప్రారంభించి.. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఇఎల్)కు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంటుగా మారనుంది. పవర్ ప్లాంట్ నిర్మాణం అనుకున్న గడువుకన్నా రెండేళ్లు అదనంగా దాటడంతో అంచనా వ్యయం రూ.29,500 కోట్ల నుంచి రూ.34,500 కోట్లకు పెరిగింది.
ప్రశాంతంగా ముగిసిన ప్రజాభిప్రాయసేకరణ..
YTPSతో వెలువడే కాలుష్యంతో నల్లమల అభయారణ్యంలో వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం పడుతుందని, కేంద్రం జారీచేసిన ఈసీని రద్దు చేయాలంటూ ముంబయికి చెందిన కన్సర్వేషన్ యాక్షన్ ట్రస్ట్, విశాఖకు చెందిన సమత అనే స్వచ్ఛంద సంస్థలు ఎన్జీటీలో కేసులు వేశాయి. దీంతో ఎన్జీటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తికి ఇచ్చిన పర్యావరణ అనుమతిని నిలిపివేసింది. కీలకమైన పర్యావరణ అంశాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలమేరకు అధికారులు ఈ నెల 20న రెండోసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రజాభిప్రాయసేకరణలో వచ్చిన అభిప్రాయాలన్నింటినీ కేంద్ర పర్యావరణ శాఖకు నివేదించేందుకు జెన్కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర పర్యావరణశాఖ త్వరలో నిర్వహించే సమావేశంలో ఈ నివేదికను సమర్పించడం ద్వారా జెన్కో ఈ ప్లాంటులో విద్యుదుత్పాదన చేపట్టేందుకు అనుమతులు కోరనుంది.
పనుల వేగవంతం పై దృష్టి సారింపు..
పవర్ ప్లాంట్కు కీలకమైన పర్యావరణ అనుమతిపై ఎన్జీటీ కొర్రీలు వేయడం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారడం, పలు ఆటంకాలు రావడంతో కొన్నాళ్లుగా వైటీపీఎస్లో పనులు మందగించాయి. ఇప్పటికే రెండు యూనిట్ల పనులు 80శాతం మేర, మిగిలిన మూడు యూని ట్లు 70శాతం మేర పూర్తయ్యాయి. విద్యుత్ఉత్పత్తికి ఏటా అవసరమయ్యే 3.5 టీఎంసీల నీటిని టెయిల్ పాండ్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ నుంచి తరలించేందుకు 22 కిలోమీటర్ల మేర చేపట్టిన పైపు లైన్ పనులు, రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంట్ వరకు 8.5 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ కూడా నిర్మిస్తున్నారు. హైటెన్షన్ విద్యుత్లైన్ టవర్ల నిర్మాణాలు ప్రగతిలో ఉన్నాయి.
వీటితో పాటు బిల్లులు పెండింగ్లో ఉండటం, సామగ్రి సరఫరా నిలిచి పోవడంతో సివిల్ పనుల నిర్వహణ నిలిచిపోయాయి. ఇటీవల నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ విజయ వంతంగా ముగియడంతో ప్లాంట్ పనులపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్ పనులపై సమీక్ష జరిపారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన ఒకటి, రెండు నెలల్లో జరిగే సమావేశంలో పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈలోగా మొదటి దశలోని రెండు యూనిట్ల పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా స్థానికులు లేవనెత్తిన ఉంచాలని దశలవారీగా పరిష్కరించాలని, సెప్టెంబరు నాటికి ఈ యూనిట్లను విద్యుదుత్పత్తికి సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




