KCR: కష్టపడి చదవండి.. తండ్రులను కోల్పోయిన బీటెక్ విద్యార్థులకు కేసీఆర్ ఆర్థిక భరోసా
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇద్దరూ ఇంజినీరింగ్ విద్యార్థులకు కాలేజ్ పూర్తి ఫీజు చెల్లించడంతో పాటు ఇతర అవసరాలకు గాను ఆర్థికసాయం అందించి భరోసా కల్పించారు. వారికి ధైర్యం చెప్పి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

గజ్వేల్ నియోజకవర్గంలోని కెసిఆర్ దత్తత గ్రామమైన ఎర్రవెల్లి గ్రామానికి చెందిన రైతు చిన్రాజు సత్తయ్య ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మరణించాడు. ఆయన కుమారుడు నవీన్ స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు పెద్దోళ్ల సాయిలు ప్రమాదవశాత్తూ కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. ఆయన కుమారుడు అజయ్ కూడా బీటెక్ చదువుతున్నాడు. అయితే తండ్రులు లేకపోవడంతో పీజులు చెల్లించడానికి ఇబ్బందిపడుతున్న విషయాన్ని ఆ గ్రామానికి చెందిన కొందరు పార్టీ నాయకులు కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన వారిని చేరదీయడంతో పాటు వారి ఇంజనీరింగ్ చదువు పూర్తికాలపు ఫీజులకు సరిపోయే చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా కష్టపడి మంచిగా చదువుకొని మంచి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కేసీఆర్ వారిని దీవించారు. ఏదైనా డబ్బుల సమస్య వస్తే తన దృష్టికి తీసుకురండి అని భరోసా ఇచ్చారు. విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి సంబంధిత విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందే ఆర్థిక తదితర సాయం గురించి పర్యవేక్షించి వారికి న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.

Kcr Financial Aid
కుటుంబ పెద్దను కోల్పోయిన తమను గుర్తించి, ఆదరించి, ఆర్థికంగా ఆదుకుని, తమ పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన కేసీఆర్ గారికి పిల్లల తల్లులు చేతులెత్తి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. తమ చదువుకోసం కేసీఆర్ ఆర్థిక సాయం చేయడం పట్ల విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
