Congress: కాంగ్రెస్ విజయంలో ఆరో ప్రాణంగా ‘ఆరు గ్యారెంటీలు’.. వాటిపై ఓ లుక్కేసేయండి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో హోరా హోరీగా హామీలను ప్రకటించాయి రాజకీయ పార్టీలు. అయితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీ పాలిట ఆరోప్రాణంగా నిలిచి తమకు అధికారాన్ని కట్టబెట్టింది. ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లడంలో కొంత మేర సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు. అలాగే వీటిని అమలు చేస్తారన్న నమ్మకం కూడా ప్రజల్లో బలంగా నెలకొంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో హోరా హోరీగా హామీలను ప్రకటించాయి రాజకీయ పార్టీలు. అయితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ పార్టీ పాలిట ఆరోప్రాణంగా నిలిచి తమకు అధికారాన్ని కట్టబెట్టింది. ముఖ్యంగా ఈ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లడంలో కొంత మేర సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ కార్యకర్తలు. అలాగే వీటిని అమలు చేస్తారన్న నమ్మకం కూడా ప్రజల్లో బలంగా నెలకొంది. ఈ తరుణంలోనే తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరేందుకు కీలక భూమిక పోషించిన ఆరు గ్యారెంటీతో పాటూ మ్యానిఫెస్టోను ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో ఏఏ వర్గాలకు ఎలా లబ్ధి చేకూరుతుందన్న విషయాన్ని మరోసారి కూలంకషంగా తెలుసుకుందాం.
కాంగ్రెస్ గత రెండు నెలల నుంచి తెలంగాణలో తన పట్టు నిలుపుకోవాలని పట్టు వదలని విక్రమార్కుడిలా అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందులో కీలక పాత్ర పోషించింది మాత్రం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మహాలక్షి పథకం
- మహిళకు ప్రతి నెలా రూ. 2500 తోపాటు.. రూ. 500 కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేలా దీనిని రూపొందించారు.
రైతు భరోసా
- ముఖ్యంగా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు రైతులు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ. 15,000, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12,000 తమ ఖాతాల్లో జమ చేసేలా గ్యారెంటీని ఏర్పాటు చేసింది. దీంతో పాటూ వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది.
గృహజ్యోతి పథకం
- తెలంగాణ కోసం పోరాడిన వారికి 200 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. అలాగే 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం
- ఇళ్లు నిర్మించుకుంటామనే ప్రతి పేదవాడికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు.
యువ వికాసం
- యువతీ, యువకులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. విద్యార్థులకు రూ. 5 లక్షలతో విద్యా భరోసా కార్డు అందజేస్తామన్నారు. దీని ద్వారా కళాశాల విద్య పూర్తి చేసిన యువతకు రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. యువ వికాసం కింద విద్యార్థులకు కోచింగ్ ఫీజులు చెల్లించనున్నారు. అదే విధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తామన్నారు.
ఇక పూర్తి మ్యానిఫెస్టో ఒకసారి పరిశీలిస్తే..
మహిళలు, యువత, నిరుద్యోగులు లక్ష్యంగా అనేక ప్రజాకర్షక పథకాలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. కల్యాణమస్తు పథకం కింద అమ్మాయి వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ కానుకంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. విద్యా, వైద్యరంగాల బలోపేతానికి పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చింది.
ఆరు గ్యారెంటీలు, వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో ఇప్పటికే రకరకాల హామీలిచ్చిన కాంగ్రెస్ తాజాగా వాటిని అనుబంధంగా 37 అంశాలతో 66 ప్రధాన హామీలు చేర్చుతూ 42 పేజీల మ్యానిఫెస్టో విడుదల చేసింది. గాంధీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్జే మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అలాగే ముఖ్యమైన హామీలన్నీ గుదిగుచ్చుతూ రెండు పేజీల లీఫ్లెట్ కూడా కాంగ్రెస్ రిలీజ్ చేసింది. చక్కని పథకాలతో మ్యానిఫెస్టో రూపొందించామని, దీని అమలుకు తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమ తొలి, మలిదశ ఉద్యమకారులను గుర్తించి వారి కుటుంబసభ్యులకు 25వేల గౌరవ పెన్షన్తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చింది. రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడంతో పాటు వడ్డీ లేకుండా 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందజేస్తామని ప్రకటించింది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు అన్ని ప్రధాన పంటలకు సమగ్రబీమా కవరేజ్ కల్పిస్తామని వెల్లడించింది. ధరణి పోర్టల్ను రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకువస్తామని కాంగ్రెస్ తెలిపింది. భూహక్కుల సమస్యల పరిష్కారికి ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులకు కొత్త పీఆర్సీ ప్రకటించి 6 నెలల్లో సిఫార్సులు అమలు చేస్తామని తెలిపింది. అలాగే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చింది.
మహిళ సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. పుట్టిన ప్రతీ అమ్మాయికి ఆర్థిక సాయం అందించేందుకు బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తామని తెలిపింది. 18 సంవత్సరాలు పైబడి వయస్సు ఉండి చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది. నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిల వివాహ సందర్భంగా లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం కూడా అందిస్తామని కాంగ్రెస్ భరోసా ఇచ్చింది. ఆటో డ్రైవర్లకు ఏటా 12 వేల ఆర్థిక సాయంతో పాటు ట్రాఫిక్ చలానాలపై 50శాతం రాయితీ కల్పిస్తామని ప్రకటించింది. అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచుతామని భరోసా ఇచ్చింది. మెగా డీఎస్సీ ప్రకటించి 6 నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ చేపడతామని తెలిపింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిర్ణీత వ్యవధిలో 2 లక్షల ఉద్యోగాల నియామకం చేపడతామని హామీ ఇచ్చింది. ప్రతీ విద్యార్థికి ఫ్రీ వై-పై సదుపాయం కల్పిస్తామని తెలిపింది. అలాగే బడ్జెట్లో విద్యా రంగం వాటాను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామని ప్రకటించింది. బాసర ట్రిపుల్ ఐటీ తరహా సంస్థలను రాష్ట్రంలో మరో నాలుగు ఏర్పాటు చేస్తామని తెలిపింది.
ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయల వరకు పెంచి అందులో మోకాలి సర్జరీని కూడా చేర్చుతామని కాంగ్రెస్ తెలంగాణ ఓటర్లకు హామీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాల, మాదిగ సామాజిక వర్గాలతోపాటూ ఇతర ఉపకులాల కోసం మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అలాగే బీసీలలోని ఇతర సామాజిక వర్గాల కోసం కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. జనగామ జిల్లా పేరును సర్దార్ సర్వాయి పాపన్నగా మార్చడంతో పాటు రాష్ట్రంలో కొత్తగా ఒక జిల్లా ఏర్పాటు చేసి దానికి పి.వి.నరసింహారావు పేరు పెడతామని తెలిపింది. హైదరాబాద్లో ఎల్బి నగర్ నుంచి ఆరాంఘర్, మెహిదీపట్నం మీదుగా గచ్చిబౌలి వరకు కొత్తగా మెట్రో లైన్ వేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హైదరాబాద్ నగరానికి వరద ముప్పు లేకుండా చేసేందుకు నాలాలను అభివృద్ధి పరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.,








