SFA Championships 2024 Day 12: ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌లో 12వ రోజు హైలెట్స్‌.. చెమటలు పట్టించిన కబడ్డీ టీం

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న SFA ఛాంపియన్ షిప్ క్రీడలు పలు స్టేడియంలలో హోరాహోరీగా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ క్రీడలు ముగియనుండటంతో ఆయా స్కూళ్లకు చెందిన యువక్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. 12వ రోజు కూడా పలు ఆటల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు.. నేటి హైలెట్స్ ఇవే..

SFA Championships 2024 Day 12: ఎస్‌ఎఫ్‌ఏ ఛాంపియన్‌షిప్‌లో 12వ రోజు హైలెట్స్‌.. చెమటలు పట్టించిన కబడ్డీ టీం
SFA Championships 2024 Day 12
Follow us

|

Updated on: Oct 27, 2024 | 9:06 PM

స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA)తో సహకారంతో టీవీ 9 నెట్‌వర్క్‌ విప్లవాత్మక ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్’ ప్రోగ్రామ్‌ను హైదరాబాద్‌లోని పలు స్టేడియంలలో వివిధ క్రీడలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. SFA ఛాంపియన్‌షిప్‌ 2024 పోటీలు యువ క్రీడాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేందుకు, వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేదికను అందిస్తుంది. SFA ఛాంపియన్‌షిప్‌లో అతిపెద్ద టాలెంట్ హంట్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఔత్సాహిక ఫుట్‌బాల్ క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనను గుర్తించడానికి, వారికి వేదికను అందించడానికి TV9 నెట్‌వర్క్ ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్’ ప్రచారంలో భాగంగా SFAతో టై అప్‌ అయ్యింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకూ 11 రోజులు విజయవంతంగా క్రీడలు జరిగాయి.. నేడు 12వ రోజు కూడా విద్యార్ధులు ఉత్సాహంగా వివిధ క్రీడల్లో పాల్గొన్నారు. ఇందులోని విజేతలను 2025 ప్రారంభంలో జర్మనీలో సత్కరిస్తారని ఇప్పటికే స్పష్టం చేసింది.

మరో రెండు రోజులు మాత్రమే ఈ చాంపియన్‌షిప్‌ కొనసాగుతుంది. దీంతో 12వ రోజు క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. ఈ రోజు హైలైట్ ఏమిటంటే.. ప్రో కబడ్డీ లీగ్ స్టార్లు తమిళ్ తలైవాస్ నుంచి నరేందర్ కండోలా, సచిన్ తన్వర్.. బెంగళూరు బుల్స్ నుంచి అజింక్యా పవార్ తలపడ్డారు. శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఫైనల్స్‌ జరిగాయి. యువ కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్టేడియం మొత్తం నినాదాలతో మారుమ్రోగిపోయింది. U-14 బాలుర కబడ్డీ ఫైనల్‌లో చింతల్‌ రెయిన్‌బో స్కూల్‌పై నిజాంపేట్‌లోని విగ్నాన్స్ బో ట్రీ స్కూల్ విజయాన్ని సాధించింది. అండర్-14 బాలికల కబడ్డీ ఫైనల్‌లో గచ్చిబౌలిలోని కేంద్రీయ విద్యాలయం స్వర్ణం సాధించింది. ఈ రోజు హైదరాబాద్‌ కబడ్డీ, టేబుల్ టెన్నిస్‌తో ఉర్రూతలూగించింది.

ఇక గచ్చిబౌలి స్టేడియంలో బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు కూడా తీవ్ర ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. అండర్-16 బాలికల వాలీబాల్ టైటిల్‌ను శెరిలింగంపల్లిలోని కార్నర్‌స్టోన్ స్కూల్ గెలుచుకోగా.. అండర్-16, అండర్-18 బాలుర వాలీబాల్ ఫైనల్స్‌లో వరుసగా మేడ్చల్‌లోని విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్, గచ్చిబౌలిలోని కేంద్రీయ విద్యాలయం విజేతలుగా నిలిచాయి. ఫుట్‌బాల్‌లో ఖాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ U-16, U-18 బాలుర విభాగాల్లో స్వర్ణాన్ని గెలుచుకుంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని క్రీడల్లో విగ్నాన్స్ బో ట్రీ స్కూల్ పాఠశాల లీడర్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. చివరి వరకూ వీరు అజేయంగా మిగిలిపోతారా లేదంటే మరేదైనా స్కూల్‌ అనూహ్యంగా ముందుకొస్తుందా అనేది చివరి రోజు వరకు వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఏడాది హైదరాబాద్ ఎడిషన్ SFA ఛాంపియన్‌షిప్స్‌లో 920 పాఠశాలల నుంచి దాదాపు 23 వేల మంది అథ్లెట్లు 22 క్రీడలలో పోటీ పడుతున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీలు అక్టోబరు 28వ తేదీ వరకు కొనసాగుతాయి. యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక వేదికను సృష్టించడంతోపాటు ఆయా స్కూళ్లు పతకాల జాబితాలో అగ్రగామిగా నిలిచేందుకు అవకాశం కల్పిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.