నిన్నటి వరకు దినసరి కూలీలు.. నేడు కార్పొరేషన్లకు మేయర్లు.. ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో సరికొత్త అధ్యాయం

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.. మహ పురుషులవుతారు అన్నాడో మహాకవి. ఈ వ్యాఖ్యలు ఈ మహిళలకు అచ్చంగా సరిపోతాయి. అయితే వీరు ఋషులైతే కాలేదు కానీ ప్రజా నేతలుగా..

నిన్నటి వరకు దినసరి కూలీలు.. నేడు కార్పొరేషన్లకు మేయర్లు.. ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో సరికొత్త అధ్యాయం
Labour Mayors
Follow us

|

Updated on: Mar 19, 2021 | 11:19 AM

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.. మహ పురుషులవుతారు అన్నాడో మహాకవి. ఈ వ్యాఖ్యలు ఈ మహిళలకు అచ్చంగా సరిపోతాయి. అయితే వీరు ఋషులైతే కాలేదు కానీ ప్రజా నేతలుగా ఎదిగారు. ఎందుకంటే వారు నిన్నటి వరకు కేవలం దినసరి కూలీలుగా జీవించిన వారు నేడే ఏకంగా మున్సిపల్‌ కార్పొరేషన్లకు మేయర్లుగా మారారు. కష్టాల్లో కుంగిపోకుండా స్వశక్తితో జీవిస్తున్న మహిళలకు వైసీపీ రూపంలో అదృష్టం వరించింది.

వివరాల్లోకి వెళితే.. చిత్తూరు కార్పొరేషన్‌ నూతన మేయర్‌గా ఎన్నికైన అముద ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు. కుటుంబం గడవడం కోసం ఒకప్పుడు కట్టెలు కొట్టి అమ్మింది ఆముద. జగన్‌ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. వైసీపీ తరఫున కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలవడమేగాక ఇప్పుడు ఏకంగా చిత్తూరు మేయర్‌గా ఎన్నికైంది.

ఆముదది చాలా పేద కుటుంబం. ఊహ కూడా తెలియని వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. అక్కతోపాటు పనికిపోయేదాన్ని. రోజూ 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడివికిపోయి కట్టెలు కొట్టేదాన్ని. వాటిని మోసుకొచ్చి మా కాలనీలో అమ్మితే రూ.20 వచ్చేవని ఆముద తెలిపింది. నేనెవరో కూడా జనానికి తెలియదు. అయితే జగనన్నను చూసి ఓట్లేసి నన్ను గెలిపించారు. ఇప్పుడు మేయర్‌ను చేశారు. ఇది నా జీవితంలో అస్సలు ఊహించలేదు. ప్రజలకు నమ్మకంగా ఉండి సేవ చేస్తానని తెలిపింది.

ఇక తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మరో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన మామా ఏ మున్సిపాల్టీలోనైతే అటెండర్‌గా పని చేశారో అదే మున్సిపాల్టీకి మేయర్‌గా ఎన్నికైంది శిరీష. శిరీష మామా మునెయ్య ఆరేళ్లక్రితం వరకు తిరుపతి మునిసిపాలిటీలో అటెండర్‌గా పనిచేశారు. కార్పొరేషన్‌ స్థాయికి ఎదిగిన తిరుపతికి ఈసారి మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు.

మునెయ్య కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. ముప్పై ఏళ్లు సేవలందించిన ఆయన రెవెన్యూ విభాగంలో అటెండర్‌గా ఆరేళ్లక్రితం రిటైరయ్యారు. అటెండరుగా తాను పనిచేసిన సంస్థకు తన కోడలు మేయరుగా ఎంపిక కావడంపై మునెయ్య, ఆయన కుటుంబీకుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు.

ఇక రాయచోటి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన ఓ కూరగాయల వ్యాపారి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.షేక్‌ బాష డిగ్రీ వరకు చదువుకున్నారు. అయితే ఉద్యోగం దొరక్కపోవటంతో గ్రామంలోనే కూరగాయలు అమ్ముతూ జీవనం సాస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో మంచి పేరున్న షేక్‌ భాషకు మున్సిపాలిటీ ఎన్నికలలో వైసీపీ కౌన్సిలర్‌ టికెట్‌ ఇచ్చింది.

మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన షేక్‌ బాష సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు. కష్టనష్టాలకు ఓర్చి మున్సిపల్‌ చైర్మన్‌గా అతడు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకంగా మారింది.

Read More:

ఆరో రౌండులోనూ సురభి వాణిదేవి ఆధిక్యం.. కొనసాగుతోన్న కౌంటింగ్.. తుది ఫలితం తేలడానికి మరింత సమయం పట్టే అవకాశం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు.. నూతన బడ్జెట్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వెల్లువ

ఉప్పల్‌ టు ఉప్పుగల్‌ బైక్‌ ర్యాలీ.. కల్లుగీత కార్మికుల నిరసనతో హోరెత్తిన జాతీయ రహదారి