ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్లో బిగ్గెస్ట్ ఎనిమీస్! వచ్చే 5-స్టేట్ ఎలక్షన్లో ఇండీ దారేది?
ప్రస్తుతం భారత రాజకీయాల్లో 'శత్రువుకు శత్రువు మిత్రుడు' అనే సూత్రం విపక్షాల ఐక్యతకు దిక్సూచిగా మారింది. ఇండీ (I.N.D.I.A.) కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ, లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం మరియు సీఈసీపై అభిశంసన తీర్మానం వంటి అంశాలు విపక్షాలను ఏకం చేయడానికి రాజకీయ అస్త్రాలుగా దొరికాయి. ఇవి కేవలం తీర్మానాలు మాత్రమే కావు, విపక్షాల ఐక్యతకు ఒక 'లిట్మస్ టెస్ట్' వంటివి. సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెట్టగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఇవి విపక్షాల్లో నింపాయి. అయితే, ఢిల్లీ స్థాయిలో కనిపిస్తున్న ఈ ఐక్యత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాయమవుతోంది. బెంగాల్లో మమత వర్సెస్ కాంగ్రెస్-లెఫ్ట్, కేరళలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ పోరు విపక్షాల ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. సీట్ల సర్దుబాటు, ప్రాంతీయ అస్తిత్వ పోరాటాలు ఈ కూటమికి పెను సవాలుగా మారాయి. తమిళనాడు, మహారాష్ట్రలో పొత్తులు బలంగా ఉన్నప్పటికీ, పంజాబ్, కేరళ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో విపక్షాల మధ్య 'పగటి పూట స్నేహం - రాత్రి పూట యుద్ధం' అనే చందంగా రాజకీయాలు సాగుతున్నాయి.

శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతారంటారు. ప్రస్తుతం దేశ రాజకీయాలు ఈ సమీకరణంతోనే నడుస్తున్నాయి. ముఖ్యంగా విపక్ష కూటమి. పైకి చూస్తే ఎవరికి వారే అన్నట్టుగా కనిపిస్తున్నా.. రాజకీయ శత్రువు కళ్ల ముందు కనిపించే సరికి.. ఏకం అవ్వాలనే కసి పెరుగుతోంది. నిజానికి, విపక్షాలకీ కలవాలనుంది. కలవడానికి బలమైన కారణాలూ ఉన్నాయ్. ఇండీ కూటమి విచ్ఛిన్నమైనా విపక్షాల్ని ఏకం చేయడానికి అస్త్రాలు వరుసగా దొరుకుతున్నాయ్. అందులో మొదటిది లోక్సభ స్పీకర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం. అఫ్కోర్స్ ఆ తీర్మానం వీగిపోయింది. రెండ్రోజుల చర్చ తరువాత.. బుధవారం సాయంత్రం నాటి ఓటింగ్లో మూజువాణి ఓటుతో ఆ తీర్మానాన్ని తిరస్కరించింది లోక్సభ. నిజానికీ ఈ తీర్మానం వీగిపోతుందని విపక్షానికి కూడా తెలుసు. కాకపోతే.. అందులో ఓ రాజకీయ వ్యూహం ఉంది. ఇండీ కూటమి ఐక్యతకు అదో లిట్మస్ టెస్ట్ లాంటింది. ఈ తీర్మానం విపక్షాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను పక్కన పెట్టి, వారిని ఒకే తాటిపైకి తెచ్చింది. ఎలా చెప్పగలరు అలా అంటే.. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు కలిసి ఉమ్మడిగా నోటీసు ఇచ్చాయి. తీర్మానంపై చర్చ జరిగినప్పుడు కూడా ఒక్కటిగానే నిలబడ్డాయి. ఓటింగ్ సమయంలో కలిసే ఉండాలని మాట్లాడుకున్నాయి. ఓవరాల్గా.. సీట్ల సర్దుబాటులో సమస్యలు ఉన్నప్పటికీ.. బీజేపీ వ్యతిరేక పోరాటంలో తామంతా ఒక్కటేననే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాయి విపక్షాలు. స్పీకర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం.. తమ దృష్టిలో ఓటమి కాదు అంటున్నాయి విపక్షాలు. భవిష్యత్తులో రాబోయే పెద్ద పోరాటాలకు.. మరీ ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలకు ఒక రిహార్సల్ అనే చెబుతున్నాయి. సంఖ్యాబలం లేకపోయినా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టగలమనే ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో సహాయపడిందనేది విపక్షం వాదన. ఒకవిధంగా దీన్నొక నైతిక విజయంగా భావిస్తున్నాయి విపక్షాలు.
ఇక విపక్షాలను ఏకం చేయడానికి దొరికిన మరో అస్త్రం.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానం. నిజానికి ఇది కూడా విపక్షాలు తమ ఐక్యతను చాటడానికే అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. పార్లమెంట్లో సీఈసీపై అభిశంసన తీర్మానం నోటీసు ఇవ్వడానికి కనీసం 100 మంది లోక్సభ ఎంపీలు, 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేయాలి. కాని, విపక్షాలు 120 మంది లోక్సభ సభ్యులు, 60 మంది రాజ్యసభ సభ్యుల నుంచి సంతకాలు సేకరించాయి. ఇదేనా విపక్షాల ఐక్యతకు అర్థం అంటే.. ఔననే చెప్పాలి. ఎందుకంటే.. ఇండీ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ లేదు. కాని, ఇండీ కూటమిలో లేని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా ఈ తీర్మానం నోటీసులపై సంతకాలు చేశారు. అంటే.. విపక్షాలన్నీ ఏకతాటిపై నడవాలనుకుంటున్న తమ ప్రతిపాదనలకు ఈ రూపంలో ఒక సిగ్నల్ వచ్చినట్టే.
పైగా అభిశంసన నోటీసుకు 150 సంతకాలు అవసరమైన చోట.. 180 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది రాహుల్ గాంధీ చేసిన పోరాటం. ఇప్పుడు సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానం అనేది మమతా బెనర్జీ పోరాటం. విడివిడిగా ఎవరికి వారు చేస్తున్న పోరాటంగా కనిపిస్తున్నా సరే.. ఇదంతా ఇండీ కూటమి ఉమ్మడి పోరాటంగా చెప్పగలిగారు. ఇందులో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీల ఎంపీలు కూడా ఉండడం విశేషం. అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే.. బెంగాల్లో తృణమూల్తో విభేదించే లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు కూడా ‘రాజ్యాంగ సంస్థల రక్షణ’ పేరుతో ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. ఈ తీర్మానం నెగ్గుతుందా లేదా అన్నది పక్కన పెడితే.. విపక్షాల ఐక్యతను చాటిచెప్పే ఎపిసోడ్గా చూపించుకోవచ్చు. ఒకసారి తీర్మానం నోటీసు ఇస్తే, దానిపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టవచ్చు. అలాంటప్పుడు విపక్షాలన్నీ కలిసి.. ఎన్డీయేపై ఫైట్ చేస్తున్నాయనే సంకేతాలు పంపించొచ్చు. ఈ అభిశంసన తీర్మానం అనేది రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలకు విపక్షాలు సిద్ధం చేసుకున్న ఒక బలమైన పొలిటికల్ అజెండా. ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో అనుమానాలు కలిగించడం ద్వారా ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెట్టడమే దీని అసలు ఉద్దేశం.
ఇక.. విపక్షాలను ఏకం చేస్తున్న మరో అస్త్రం.. గ్యాస్ షార్టేజ్. ప్రస్తుతం విపక్షాలకు ఇదే బలమైన రాజకీయ ఆయుధం. గ్యాస్ సంక్షోభంపై విపక్షాలు పార్లమెంటులో ఉమ్మడి పోరాటం చేస్తున్నాయి. పార్లమెంట్ ఆవరణలో నిరసన చేశాయి. ఈ ఐక్యత రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ కనిపించింది. 2026లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇండీ కూటమికి ఒక పెద్ద పరీక్షే. ఎందుకంటే.. లోక్సభలో ఇలా కలిసి పోరాడుతున్న పార్టీలు, రాష్ట్రాల అసెంబ్లీ మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం శత్రువులుగా మారుతున్నాయి. ఎవరికి వాళ్లు పైకి ఎక్కాలనే ఆత్రుతతో వాళ్లలో వాళ్లే తోసుకుంటున్నారు. ఇక అసలు ప్రశ్న. లోక్సభలో కలిసున్న పార్టీలు.. ఢిల్లీ స్థాయిలో కలిసి పోరాడుతున్న ఈ విపక్షాలు.. రాష్ట్రాల అసెంబ్లీ మెట్లు ఎక్కేసరికి ఎందుకు శత్రువులుగా మారుతున్నాయి? నిజానికి, ఢిల్లీ స్థాయిలోనే పొత్తు తప్ప రాష్ట్ర స్థాయిలో కనిపించదు. అల్రడీ ఇట్స్ ప్రూవెన్. సపోజ్.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలను తీసుకుందాం.
ముందుగా పశ్చిమ బెంగాల్. ఇక్కడ మమత వర్సెస్ ‘కాంగ్రె-లెఫ్ట్’ అన్నట్టుగా ఉంటుంది. వంగ దేశంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిపి పోటీ చేస్తాయి. అంతేకాదు.. కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్టులు కలిసి మమతను దారుణంగా విమర్శిస్తుంటారు. మమతా బెనర్జీని “నిరంకుశ పాలకురాలు”గా అని ఆరోపిస్తుంటారు. అలాంటిది రాష్ట్రంలో ఈ ముగ్గురూ కలిసి పోటీ చేయడం అసంభవం. దీనికి చాలా కారణాలున్నాయ్. బెంగాల్లో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల కంటే తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉంది. అంతేకాదు, మమతా బెనర్జీకి కాంగ్రెస్ నాయకత్వం అంటే పడదు. “ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ పక్కకు తప్పుకోవాలి” అనేది ఆమె వాదన. సో, సీట్ షేరింగ్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు మమత. బెంగాల్లో తనను తాను ‘బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయం’గా భావిస్తారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. కాంగ్రెస్ తనను కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా చూడటాన్ని ఆమె సహించరు. ఇక బెంగాల్లో కాంగ్రెస్-లెఫ్ట్ ఒక్కటైతే, అది తన ముస్లిం ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందని మమత భయం. అందుకే “కాంగ్రెస్ 40 సీట్లు కూడా గెలవలేదు” అంటూ బహిరంగంగా విమర్శిస్తుంటారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా స్టేట్ లెవెల్ పాలిటిక్స్లో తృణమూల్ను దగ్గరికి రానివ్వదు. మమతతో కలిసి అడుగులు వేస్తే.. బెంగాల్లో తమ ఉనికిని కోల్పోతామని అధిర్ రంజన్ చౌదరి వంటి స్థానిక నేతలు గోలపెట్టేస్తుంటారు. సో, బెంగాల్లో “ఫ్రెండ్లీ ఫైట్” కూడా సాధ్యం కానంతటి రాజకీయ వైరం ఉంది. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి, అభిశంసన తీర్మానానికి ఇండీ కూటమితో కలిసి నడుస్తున్న మమత.. రాష్ట్రంలో మాత్రం ఇదే ఇండీ కూటమిలోని పార్టీలను దగ్గరకు రానివ్వడం లేదు.
ఇక కేరళం సంగతి. ఇక్కడ గనక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిశాయంటే మాత్రం.. ఒకే ఇంట్లో ఇద్దరు యజమానులు ఉన్నట్టు ఉంటుంది. కేరళం రాజకీయం దశాబ్దాలుగా లెఫ్ట్ కూటమి అయిన LDF, కాంగ్రెస్ కూటమి అయిన UDF మధ్యే పోరు సాగుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పక్కపక్కనే కూర్చుంటాయి. కానీ కేరళంలో.. కాంగ్రెస్ గెలవాలంటే కమ్యూనిస్టులను ఓడించాలి, కమ్యూనిస్టులు గెలవాలంటే కాంగ్రెస్ను ఓడించాలి. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా లెఫ్ట్ పార్టీలు సమర్థించవచ్చు గానీ.. కేరళంలో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడాన్ని లెఫ్ట్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ పెద్దగా బలంగా లేని కేరళంలో వీరు పక్కపక్కనే ఉంటే.. ప్రజలు థర్డ్ ఆప్షన్ అయిన బీజేపీ వైపు చూస్తారనే భయం వీరిద్దరినీ కలవనివ్వడం లేదు. సో, ఇక్కడ కూడా విపక్షాల మధ్య ఐక్యత అనేది అసాధ్యం. ఎందుకంటే వీరిద్దరూ కలిస్తే, అక్కడ ఖాళీ అయ్యే విపక్ష స్థానాన్ని BJP భర్తీ చేసే ప్రమాదం ఉందని ఇరు పార్టీలు ఆందోళన.
ఇక తమిళనాడు సంగతి. విపక్షాల మధ్య కాస్త ఐక్యత కనిపించేది ఇక్కడే. ఇక్కడ DMK కూటమి చాలా పటిష్టంగా ఉంది. సో, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేసినా.. DMK ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఒకవేళ కాంగ్రెస్ తగ్గకపోతే, పొత్తులో చిక్కులు వచ్చే అవకాశం ఉంది. పైగా రాబోయే ఎన్నికల్లో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. విజయ్ TVK పార్టీతో యువత ఓట్లను చీల్చే అవకాశం ఉంది. దీంతో.. ఎలాగైనా గెలవాలనే కోరుకుంటుంది తప్ప.. కాంగ్రెస్ కోసం సర్దుకుపోయే పరిస్థితే కనిపించడం లేదు.
అసోం సంగతి చూద్దాం. అసోంలో విపక్షాలు చాలా ముందుగానే ఏకమయ్యాయి. మొత్తం 18 విపక్ష పార్టీలు కలిసి ‘మహాజోత్’ పేరుతో కూటమి కట్టాయి. 18 పార్టీలు ఒకే వేదికపైకి రావడం నాట్ ఏ జోక్. బట్.. సమస్య ఇక్కడే మొదలైంది. ఈ 18 పార్టీల మధ్య 126 సీట్లను పంచుకోవడం ఒక పీడకల లాంటిదే. అందులోనూ AIUDF (బద్రుద్దీన్ అజ్మల్) పార్టీని కూటమిలోకి తీసుకోవాలా వద్దా అన్నది పెద్ద ప్రశ్న. తీసుకుంటే హిందూ ఓట్లు దూరమవుతాయని, తీసుకోకపోతే ముస్లిం ఓట్లు చీలుతాయన్న భయం వెంటాడుతోంది. ఓవరాల్గా సీట్ల పంపిణీ దగ్గరికి వచ్చే సరికి అసోంలో విపక్షాల ఐక్యత ఎంత బలంగా ఉంటుందన్నది చూడాలి.
నెక్ట్స్.. పుదుచ్చేరి. ఇక్కడ రంగస్వామి నేతృత్వంలోని NR కాంగ్రెస్, BJP కూటమి బలంగా ఉన్నాయి. కాంగ్రెస్-DMK ఐక్యంగా ఉంటేనే ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ చిన్న రాష్ట్రం కావడంతో స్థానిక నేతల ఆధిపత్య పోరు ఐక్యతకు అడ్డంకిగా మారింది. ఈ ఐదు రాష్ట్రాల్లో విపక్షాల ఐక్యత అనేది “రాష్ట్రానికో తీరు” అన్నట్లుగా ఉంటుంది. ఇండీ కూటమిలోని పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కేవలం రాజకీయ వైరం మాత్రమే కాదు. అవి అస్తిత్వ పోరాటాలు.
జాతీయ స్థాయితో నరేంద్ర మోదీని అడ్డుకోవడానికి అందరూ ఒక్కటే. కాని, రాష్ట్ర స్థాయిలో మాత్రం తమ ఉనికిని కాపాడుకోవడానికి ఒకరితో ఒకరు యుద్ధం చేస్తుంటారు. ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు ఎలా స్వీకరిస్తారనేది పెద్ద ప్రశ్న.
అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లోనే విపక్షాల మధ్య ఐక్యత లేదు. ఇక మిగిలిన రాష్ట్రాల్లో ఉంటుందని ఆశించడం అత్యాశే. సపోజ్.. ఢిల్లీ, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో చూద్దాం. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి ఉంటుంది. వీరిద్దరి మధ్య బంధం ‘పగటి పూట స్నేహం – రాత్రి పూట యుద్ధం’ లాంటిది. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతమే.. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆక్రమించడం. రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పురుడుపోసుకుందందంటే కారణమే కాంగ్రెస్ పార్టీ కదా. సో, కాంగ్రెస్ ఎక్కడైతే బలహీనపడుతుందో.. అక్కడ ఆమ్ఆద్మీ పార్టీ బలపడుతోంది. కావాలంటే పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, గోవా రాష్ట్రాలను చూడొచ్చు. ఈ నాలుగు రాష్ట్రాల్లో.. ఇప్పటికీ కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారానే కేజ్రీవాల్ పార్టీ మనుగడ సాగిస్తోంది. రీసెంట్ ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కేజ్రీవాల్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగినా.. పంజాబ్లో మాత్రం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. కేజ్రీవాల్కు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కన్నా ఎక్కువ ప్రాధాన్యత కావాలనే పట్టుదల ఈ రెండు పార్టీల మధ్య పొత్తును పొసగనివ్వడం లేదు.
ఇక మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లో సంగతి. మధ్యప్రదేశ్లో సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును చూసి గతంలో ఆ పార్టీపై ఫైర్ అయ్యారు అఖిలేశ్ యాదవ్. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ తమకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో అఖిలేష్ యాదవ్ గట్టిగానే హర్ట్ అయ్యారు. ‘కాంగ్రెస్ పార్టీ గర్వంతో ఉంది’ అనే హాట్ కామెంట్ కూడా చేశారప్పట్లో. ఇక ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోరాడొచ్చు. కాని, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే తన క్యాడర్ దెబ్బతింటుంది అనేది అఖిలేష్ యాదవ్ భయం. సో, ఢిల్లీ స్థాయిలో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ కలిసే నడుస్తున్నా.. రాష్ట్రాల్లో మాత్రం ఎవరికివారే యమునా తీరే.
ఇండీ కూటమి నుంచి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ బయటికొచ్చింది. మొన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా వైదొలగింది. జార్ఖండ్లో అధికారంలో ఉన్న JMM.. బిహార్ సరిహద్దులో గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పోటీ చేయాలనుకుంది. దీంతో తమకు 12 సీట్లు ఇవ్వమని కాంగ్రెస్-RJD కూటమిని కోరింది. బట్.. ఆ సమయంలో 2, 3 సీట్లు మాత్రమే ఇస్తామని చెప్పాయి. చర్చలు విఫలం అవడంతో ఇండీ కూటమి నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా బయటికొచ్చేసింది. ప్రస్తుతం అసోంలో పోటీ చేయాలనుకుంటున్న JMM.. అక్కడ జై భారత్ పార్టీతో పొత్తు ప్రకటించింది. సో, జార్ఖండ్, బిహార్, అసోంలో విపక్షాలన్నీ కలిసి పనిచేసే పరిస్థితి లేదు.
ఇక మహారాష్ట్రలో సంగతి. మరాఠా రాజకీయాల్లో మహా వికాస్ అఘాడీ కూటమి మనుగడ కేవలం ఒక రాజకీయ అవసరం మాత్రమే కాదు.. శివసేన UBT, NCP శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీల అస్తిత్వ పోరాటం. మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న రాజకీయ చదరంగంలో ఏ ఒక్క పార్టీ కూడా ఒంటరిగా బీజేపీ-శివసేన(షిండే)-NCP(అజిత్ పవార్) కూటమిని ఢీకొట్టడం అసాధ్యం. పార్టీ పేరు, గుర్తు చేజారిపోయిన తర్వాత ఉద్ధవ్ థాక్రేకు తన క్యాడర్ను కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా అవసరం. ముఖ్యంగా ముంబై, కొంకణ్ ప్రాంతాల్లో బీజేపీని అడ్డుకోవాలంటే థాక్రేకు కాంగ్రెస్ మద్దతు కీలకం. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత.. శరద్ పవార్ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ మహారాష్ట్రలో తన పట్టును నిలుపుకోవడానికి కాంగ్రెస్తో కలిసి వెళ్లడం తప్ప ఆయనకు మరో మార్గం లేదు. ఒకప్పుడు మహారాష్ట్రలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు పుంజుకోవాలంటే.. ఈ మూడు పార్టీలు అవసరం. సో, తమిళనాడు తరువాత మహారాష్ట్రలోనే ఇండీ కూటమి కాస్త కలిసికట్టుగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ఈ మూడు పార్టీలు విడిపోతే ‘రాజకీయంగా ఆత్మహత్య’ చేసుకున్నట్టే అని వీరికి తెలుసు. అందుకే చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ, బీజేపీని ఎదుర్కోవడానికి మహా వికాస్ అఘాడీని ఒక బలమైన కవచంలా వాడుకుంటున్నారు. లోక్సభ స్పీకర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఈ మూడు పార్టీల ఎంపీలు ఏకతాటిపై నిలిచి మద్దతు తెలిపారు.
ఏదేమైనా.. విపక్షాలు అంశాల వారీగా పార్లమెంట్లో ఒక్కటవుతున్నప్పటికీ, రాష్ట్ర ఎన్నికల వద్దకు వచ్చేసరికి ‘సీట్ల సర్దుబాటు’ వారి ఐక్యతకు అతిపెద్ద సవాలుగా నిలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల నాటికి వీరంతా ఏకతాటిపైకి రావడం అనేది ఆయా రాష్ట్రాల్లో వారు సాధించే ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..



