ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్లో బిగ్గెస్ట్ ఎనిమీస్! వచ్చే 5-స్టేట్ ఎలక్షన్లో ఇండీ దారేది?
ప్రస్తుతం భారత రాజకీయాల్లో 'శత్రువుకు శత్రువు మిత్రుడు' అనే సూత్రం విపక్షాల ఐక్యతకు దిక్సూచిగా మారింది. ఇండీ (I.N.D.I.A.) కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ, లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం మరియు సీఈసీపై అభిశంసన తీర్మానం వంటి అంశాలు విపక్షాలను ఏకం చేయడానికి రాజకీయ అస్త్రాలుగా దొరికాయి. ఇవి కేవలం తీర్మానాలు మాత్రమే కావు, విపక్షాల ఐక్యతకు ఒక 'లిట్మస్ టెస్ట్' వంటివి. సంఖ్యాబలం లేకపోయినా ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెట్టగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఇవి విపక్షాల్లో నింపాయి. అయితే, ఢిల్లీ స్థాయిలో కనిపిస్తున్న ఈ ఐక్యత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాయమవుతోంది. బెంగాల్లో మమత వర్సెస్ కాంగ్రెస్-లెఫ్ట్, కేరళలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ పోరు విపక్షాల ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. సీట్ల సర్దుబాటు, ప్రాంతీయ అస్తిత్వ పోరాటాలు ఈ కూటమికి పెను సవాలుగా మారాయి. తమిళనాడు, మహారాష్ట్రలో పొత్తులు బలంగా ఉన్నప్పటికీ, పంజాబ్, కేరళ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో విపక్షాల మధ్య 'పగటి పూట స్నేహం - రాత్రి పూట యుద్ధం' అనే చందంగా రాజకీయాలు సాగుతున్నాయి.

శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతారంటారు. ప్రస్తుతం దేశ రాజకీయాలు ఈ సమీకరణంతోనే నడుస్తున్నాయి. ముఖ్యంగా విపక్ష కూటమి. పైకి చూస్తే ఎవరికి వారే అన్నట్టుగా కనిపిస్తున్నా.. రాజకీయ శత్రువు కళ్ల ముందు కనిపించే సరికి.. ఏకం అవ్వాలనే కసి పెరుగుతోంది. నిజానికి, విపక్షాలకీ కలవాలనుంది. కలవడానికి బలమైన కారణాలూ ఉన్నాయ్. ఇండీ కూటమి విచ్ఛిన్నమైనా విపక్షాల్ని ఏకం చేయడానికి అస్త్రాలు వరుసగా దొరుకుతున్నాయ్. అందులో మొదటిది లోక్సభ స్పీకర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం. అఫ్కోర్స్ ఆ తీర్మానం వీగిపోయింది. రెండ్రోజుల చర్చ తరువాత.. బుధవారం సాయంత్రం నాటి ఓటింగ్లో మూజువాణి ఓటుతో ఆ తీర్మానాన్ని తిరస్కరించింది లోక్సభ. నిజానికీ ఈ తీర్మానం వీగిపోతుందని విపక్షానికి కూడా తెలుసు. కాకపోతే.. అందులో ఓ రాజకీయ వ్యూహం ఉంది. ఇండీ కూటమి ఐక్యతకు అదో లిట్మస్ టెస్ట్ లాంటింది. ఈ తీర్మానం విపక్షాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను పక్కన పెట్టి, వారిని ఒకే తాటిపైకి తెచ్చింది. ఎలా చెప్పగలరు అలా అంటే.. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీలు కలిసి ఉమ్మడిగా నోటీసు ఇచ్చాయి. తీర్మానంపై చర్చ జరిగినప్పుడు కూడా ఒక్కటిగానే నిలబడ్డాయి. ఓటింగ్ సమయంలో కలిసే ఉండాలని మాట్లాడుకున్నాయి. ఓవరాల్గా.. సీట్ల సర్దుబాటులో సమస్యలు ఉన్నప్పటికీ.. బీజేపీ వ్యతిరేక పోరాటంలో తామంతా ఒక్కటేననే సంకేతాన్ని ప్రజల్లోకి పంపాయి విపక్షాలు. స్పీకర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం.. తమ దృష్టిలో ఓటమి కాదు...