Crime News: పిల్లలు పుట్టడం లేదని.. బాలుడిని దారుణంగా చంపి రక్తం తాగిన మహిళ.. ఐదేళ్ల తర్వాత..
ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మింది.. క్షుద్రపూజల పేరుతో ఓ చిన్నారిని చంపి రక్తం తాగింది.. ఉత్తరప్రదేశ్లో ఐదేళ్ల క్రితం జరిగిన ఈ షాకింగ్ ఘటన కలకలం రేపింది.
Woman gets life term for killing boy: ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మింది.. క్షుద్రపూజల పేరుతో ఓ చిన్నారిని చంపి రక్తం తాగింది.. ఉత్తరప్రదేశ్లో ఐదేళ్ల క్రితం జరిగిన ఈ షాకింగ్ ఘటన కలకలం రేపింది. చిన్నారిని చంపి రక్తం తాగిన కేసులో మహిళకు బరేలీలోని న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. క్షుద్రపూజల పేరుతో మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి మహిళ ఈ దారుణానికి పాల్పడింది. ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పుర్ జిల్లా రోజా పోలీస్స్టేషన్ పరిధిలోని జముకా గ్రామంలో ధన్దేవి (33) అనే మహిళ.. 2017 డిసెంబరు 5న పొరుగున ఉండే పదేళ్ల బాలుడిని చంపి రక్తం తాగింది. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ధన్ దేవికి సంతానం లేకపోవడంతో.. ఓ మాంత్రికుడు.. ఇలా చేయాలని చెప్పాడు. క్షుద్రపూజలు చేసి.. ఓ బాలుడిని చంపితే పిల్లలు పుడతారని చెప్పడంతో మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. పొరుగింట్లో ఉండే లాల్దాస్ అనే పదేళ్ల బాలుడికి టీవీ చూపిస్తానని మాయమాటలు చెప్పి ధన్ దేవీ ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం ఇంట్లో పెట్టి తాళం వేసింది. తన భర్త సూరజ్, బంధువు సునీల్ కుమార్ సహాయంతో క్షుద్రపూజలు నిర్వహించి బాలుడి గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత బాలుడి చెంపను కోసి రక్తాన్ని తాగింది. క్షుద్రపూజలు ముగిసిన తర్వాత మృతదేహాన్ని ఇంటి ముందు పడేసింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ హత్యతో సంబంధం ఉన్న ధన్దేవీతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. తాజాగా వారందరికీ జిల్లా కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా బరేలీ అదనపు జిల్లా ప్రభుత్వ న్యాయవాది వినోద్ శుక్లా మాట్లాడుతూ.. “ఇది భయంకరమైన నేరం. మహిళ మొదట బాలుడి రక్తాన్ని తీసి, ఆమె ముఖానికి పూసుకుందని, అతనిని చంపడానికి ముందు క్షుద్రపూజల్లో భాగంగా రక్తం తాగింది’’ అని తెలిపారు.
ఆ మహిళ వివాహమైన ఆరేళ్ల తర్వాత కూడా గర్భం దాల్చకపోవడంతో.. తాంత్రికుడిని సంప్రదించిందని.. ఇలా చేస్తే గర్భం దాలుస్తుందని చెప్పడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకుందని తెలిపారు. కాగా, నిందితులకు మరణశిక్ష విధించాలని బాలుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..