Manipur: సందట్లో సడేమియా అన్నట్లు విమానయాన సంస్థల తీరు.. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో..
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా మండుతోంది. మూడు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ATSUM) నేతృత్వంలో జరిగిన ర్యాలి హింసాత్మకంగా మారిన క్రమంలో మణిపూర్ అట్టుడుకుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 5 రోజులపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు...
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా మండుతోంది. మూడు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్(ATSUM) నేతృత్వంలో జరిగిన ర్యాలి హింసాత్మకంగా మారిన క్రమంలో మణిపూర్ అట్టుడుకుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 5 రోజులపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇక అల్లర్లను అణిచి వేసేందుకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఉంది. హింసాత్మక ఘటనలను నివారించేందుకు పారామిలటరీ బలగాలను సైతం మోహరించింది.
ఇదిలా ఉంటే మణిపూర్లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ నెట్టుకువస్తున్నారు. మణిపూర్లోని ప్రఖ్యాత విద్యా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మరికొన్ని సంస్థల్లో తెలంగాణ విద్యార్థులు విద్యనభ్యిస్తున్నారు. విద్యార్థులను సొంతూళ్లకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు సైతం ప్రయత్నాలు మొదలు పెట్టాయి ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విమానం ద్వారా విద్యార్థులను హైదరాబాద్కు తరలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
భారీగా ధరలు పెంచేసిన సంస్థలు..
ఓవైపు మణిపూర్ రావణకాష్టంలా మండిపోతుంటే కొన్ని ప్రైవేటు విమాన సంస్థలు ఆ మంటలతో చలి కాచుకుంటున్నాయి. పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమనిపించకమానదు. అల్లర్ల తర్వాత పెరిగిన విమాన ఛార్జీలే దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పొచ్చు. సాధారణంగా అల్లర్లకు ముందు ఇంపాల్ నుంచి హైదరాబాద్కు విమాన టికెట్ ధర రూ. 7000 నుంచి రూ. 9000 వరకు ఉండేది. కానీ ప్రస్తుతం ఈ ధర ఏకంగా రూ. 30 నుంచి రూ. 35 వేలకు చేరడం గమనార్హం. ఆ సంస్థ, ఇ ఈ సంస్థ అనే తేడా లేకుండా అన్ని ప్రైవేటు సంస్థలు టికెట్ రేట్లను ఇష్టారాజ్యంగా పెంచేశాయి. మానవతా ధృక్పథంతో ఆలోచించాల్సిన సమయంలో విమానయాన సంస్థలు ఇలా దోచుకోవడం అన్యాయమంటున్నారు ప్రజలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..