ISRO: ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇస్రో గోల్డెన్ ఛాన్స్
శాస్త్రవేత్త కావాలన్న కలలకు ఇప్పుడు ఇస్రో దారి చూపుతోంది. ఎనిమిదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం యువికా కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానించింది. మార్చి 31లోపు నమోదు చేసుకున్న ప్రతిభావంతులకు మే నెల నుంచి దేశంలోని రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. గ్రామీణ విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టే ఈ కార్యక్రమం భవిష్యత్ శాస్త్రవేత్తలకు తొలి అడుగుగా నిలవనుంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవితరాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్ర–సాంకేతిక రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల్లో విజ్ఞానాసక్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఎనిమిదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం యువికా (Young Scientist Programme – YUVIKA) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇస్రో సూచించింది. దరఖాస్తు చేసిన వారిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి, మే 10వ తేదీ నుంచి దేశంలోని ఇస్రోకు చెందిన రాకెట్ ప్రయోగ కేంద్రాలు మరియు పరిశోధనా సంస్థల్లో ఉచిత శిక్షణ అందించనుంది. శిక్షణ కాలంలో నివాసం, భోజనం తదితర అన్ని వసతులు ఇస్రో వంతుగా కల్పించబడతాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అంతరిక్ష శాస్త్రంపై ప్రాథమిక అవగాహనతో పాటు, రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహ సాంకేతికత, పరిశోధనా విధానాలపై ప్రత్యక్ష అనుభవం కల్పించబడుతుంది. భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ఇది తొలి మెట్టుగా నిలవనుంది. ఇస్రో బెంగళూరులోని ప్రధాన కేంద్రంతో పాటు ఇతర కేంద్రాల్లో కూడా యువికా శిక్షణా తరగతులు నిర్వహించబడతాయి. సైన్స్పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కలలకు రెక్కలు తొడగాలని ఇస్రో పిలుపునిస్తోంది.
Also Read: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం
