AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్‌ వివాదం.. బెంగాల్‌లో రాజకీయ దుమారం

డార్జిలింగ్‌లో జరిగిన అంతర్జాతీయ సంతాల్‌ సదస్సు ఏర్పాట్లపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసంతృప్తి వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది. సదస్సు వేదిక మార్పు కారణంగా సంతాల్‌ సమాజానికి చెందిన అనేక మంది హాజరుకాలేకపోయారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించగా, ప్రోటోకాల్‌ ఉల్లంఘన ఆరోపణలను సీఎం మమతా బెనర్జీ ఖండించారు. ఘటనపై కేంద్రం బెంగాల్‌ ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్‌ వివాదం.. బెంగాల్‌లో రాజకీయ దుమారం
President Droupadi Murmu - PM Modi - CM Mamata Banerjee
Ram Naramaneni
|

Updated on: Mar 08, 2026 | 4:59 PM

Share

గిరిజన సంస్కృతిని ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశించిన అంతర్జాతీయ సంతాల్‌ సదస్సు ఇప్పుడు రాజకీయ వివాదానికి దారి తీసింది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏర్పాట్లపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసంతృప్తి వ్యక్తం చేయడంతో విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సదస్సుకు హాజరైన అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహించిన ప్రదేశం సరైన ఎంపిక కాదని వ్యాఖ్యానించారు. సంతాల్‌ సమాజానికి చెందిన ఎంతో మంది ప్రజలు తమ సంస్కృతిని జరుపుకునే ఈ సదస్సుకు హాజరుకాలేకపోవడం తనను బాధించిందని తెలిపారు. సాధారణంగా రాష్ట్రపతులు ఇలాంటి విషయాల్లో మితంగా మాట్లాడుతారు. అయితే ఈసారి ముర్ము స్పష్టంగా అభిప్రాయం చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

టీఎంసీపై మోదీ తీవ్ర విమర్శలు

ఈ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతి వ్యక్తం చేసిన బాధ దేశ ప్రజలను కలిచివేసిందని ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పేర్కొన్నారు. “ఇది సిగ్గుచేటు, ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ ఇది బాధించింది” అని మోదీ వ్యాఖ్యానించారు.

గిరిజన సమాజానికి చెందిన రాష్ట్రపతి వ్యక్తం చేసిన బాధ దేశంలోని పౌరులను కలవరపరిచిందని ఆయన అన్నారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని, టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందని విమర్శించారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమని, ఆ గౌరవాన్ని ఎల్లప్పుడూ కాపాడాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు.

వేదిక మార్పుతో మొదలైన వివాదం

ఈ వివాదానికి కారణం సదస్సు వేదిక మార్పు. మొదట డార్జిలింగ్‌ జిల్లాలోని బిధన్నగర్‌లో నిర్వహించాలని నిర్ణయించిన ఈ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా ప్రాంతం గోసైన్‌పూర్‌కు మార్చారు. ఈ మార్పు వల్ల సంతాల్‌ సమాజానికి చెందిన అనేక మంది కార్యక్రమానికి చేరుకోవడం కష్టమైందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. అక్కడి విస్తారమైన ప్రదేశాన్ని చూస్తే పెద్ద సంఖ్యలో ప్రజలు చేరేలా కార్యక్రమం నిర్వహించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

సీఎం గైర్హాజరు అంశంపై చర్చ

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా కనీసం ఓ సీనియర్‌ మంత్రి హాజరు కాకపోవడం కూడా చర్చనీయాంశమైంది. సాధారణంగా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం లేదా మంత్రులు స్వాగతం పలకడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే ఈసారి సిలిగురి మేయర్‌ గౌతమ్‌ దేబ్‌ మాత్రమే విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ముర్ము భావోద్వేగంగా స్పందించారు. “రాష్ట్రపతి ఎక్కడికైనా వస్తే ముఖ్యమంత్రి, మంత్రులు కూడా రావాలి. నేను బెంగాల్‌ కుమార్తెనే. మమతా బెనర్జీని నా చెల్లెలిగా భావిస్తాను. ఆమె నాపై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో తెలియదు” అని అన్నారు.

ఆరోపణలను తిరస్కరించిన మమతా

ఈ వివాదంపై స్పందించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రోటోకాల్‌ ఉల్లంఘన ఆరోపణలను ఖండించారు. రాష్ట్రపతి కార్యాలయం పంపిన మార్గదర్శకాల ప్రకారమే స్వాగతం, వీడ్కోలు ఏర్పాట్లు చేశామని తెలిపారు. సిలిగురి మేయర్‌, జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ కలిసి రాష్ట్రపతిని స్వాగతించారని పేర్కొన్నారు. సదస్సు నిర్వాహకుల వద్ద తగిన సిద్ధత లేకపోవడం వల్ల సమస్యలు ఏర్పడి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. జిల్లా పరిపాలన నుంచి ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని స్పష్టం చేశారు.

నివేదిక కోరిన కేంద్రం 

రాష్ట్రపతి పర్యటనలో జరిగిన పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ పశ్చిమ బెంగాల్‌ ప్రధాన కార్యదర్శిని సంప్రదించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలలోపు నివేదిక సమర్పించాలని సూచించారు. రాష్ట్రపతిని స్వాగతించే ప్రోటోకాల్‌, సదస్సు వేదిక మార్పు, ప్రయాణ మార్గంలో చేసిన మార్పులు, ఇతర ఏర్పాట్లపై వివరణ కోరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎందుకు హాజరు కాలేదనే అంశంపైనా వివరాలు కోరినట్లు తెలిసింది.

రాజకీయంగా ముదిరిన వివాదం

ఈ ఘటనతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వాల మధ్య రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. టీఎంసీ పరిపాలన వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను మమతా బెనర్జీ ఖండిస్తూ, ఎన్నికల ముందు రాష్ట్రపతి పదవిని కూడా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని బీజేపీపై ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో గిరిజన సమాజానికి జరిగిన ఘటనలపై ఇదే స్థాయి ఆగ్రహం ఎందుకు కనిపించలేదని ఆమె ప్రశ్నించారు. ఈ పరిణామాలతో గిరిజన సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సంతాల్‌ సదస్సు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

Follow Us