అరేయ్ ఏంట్రా ఇలా ఉన్నావ్.. తొడబుట్టిన తమ్ముడినే కత్తితో పొడిచి చంపిన బాలుడు.. ఆ తర్వాత..
సమాజంలో నేరాలు, ఘోరాలు రోజురోజుకు ఎంతలా పెరిగిపోతున్నాయో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ మరీ ఘోరంగా వయసుతో సంబంధం లేకుండా ఓ మైనర్ బాలుడు తన సొంత తమ్ముడిని హత్య చేసి భూమిలో పాతిపెట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్న వివాదం కాస్తా ప్రాణాంతకంగా మారింది. తద్వారా మైనర్ బాలుడు హంతకుడిగా మారిన ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ ఈ దారుణ ఘటన అసలు ఎందుకు జరిగిందో.. ఎలా జరిగిందో అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒడిశా రాష్ట్రం బలాంగీర్ జిల్లా టిట్లాగఢ్లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కేసు విచారణలో ఎన్నో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ మైనర్ బాలుడు తన సోదరుడిని హత్య చేసినట్లు ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసు కొన్ని రోజులుగా మిస్టరీగానే ఉంది. అయితే.. చిన్న కుమారుడు అకస్మాత్తుగా ఇంటి నుంచి అదృశ్యమవ్వడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో కొంతకాలం తర్వాత తల్లికి పెద్ద కుమారుడిపై అనుమానం కలిగింది. దీంతో ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. విచారణలో భాగంగా పెద్ద కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతడు అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. తానే తన తమ్ముడిని హత్య చేశానని.. ఆ తర్వాత మృతదేహాన్ని పాతిపెట్టానని చెప్పాడు.
నిందితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. హత్య చేసిన తర్వాత మొదట ఇంటి వెనుక మృతదేహాన్ని పాతిపెట్టాడు. తర్వాత దాన్ని బయటకు తీసి 300-400 మీటర్ల దూరంలో మరో చోట మళ్లీ పాతిపెట్టాడు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు జరిపిన బలాంగీర్ ఎస్పీ మీడియాకు సంచలన విషయాలను వెల్లడించారు. జూన్ 28న కేసు నంబర్ 216/25 కింద 12 ఏళ్ల నారాయణ అనే బాలుడి అదృశ్యంపై కేసు నమోదు చేశారు. తల్లి ఫిర్యాదు ఆధారంగా నార్తర్న్ రేంజ్ ఐజీ ఆదేశాలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. టిట్లాగఢ్ డీఎస్పీ, స్టేషన్ ఇన్ఛార్జ్ ఈ బృందంలో ముఖ్య పాత్ర పోషించారు. బలాంగీర్, కాలాహాండి, నువాపడా, రాయపూర్ జిల్లాల్లో బాలుడి కోసం వెతికారు కానీ ఫలితం రాలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులను మళ్లీ ప్రశ్నించగా.. తల్లి చెప్పిన వివరాల ఆధారంగా పెద్ద కుమారుడిపై అనుమానం మరింత బలపడింది. ఆపై కేసు దర్యాప్తులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటికి వచ్చాయి.
విచారణలో పెద్ద కుమారుడు భూపేష్, తన తమ్ముడిపై వంటగదిలో ఉండే సుమారు 6 ఇంచుల పొడవైన పదునైన కత్తితో దాడి చేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుక పాతిపెట్టి, రాత్రి 1 గంట సమయంలో తల్లి చీర సహాయంతో బయటకు తీసి 300 మీటర్ల దూరంలోని మరో చోట పాతిపెట్టాడు. మేజిస్ట్రేట్, వైద్య అధికారులు, పోలీసు, సైంటిఫిక్ టీమ్ సమక్షంలో క్రైమ్ సీన్ రీక్రియేట్ చేసి, మృతదేహాన్ని వెలికితీశారు. హత్యకు ఉపయోగించిన కత్తి, మృతదేహాన్ని తరలించడానికి ఉపయోగించిన చీరను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో..
పెద్ద కొడుకుకు చిన్న కొడుకుపై ముందు నుంచే కోపం ఉండేది. తల్లిదండ్రుల ప్రేమ చిన్న కొడుకు పుట్టిన తర్వాత తనపై తగ్గిపోయిందని భావించేవాడు. అది. కాస్తా భరించలేని స్థితికి చేరి ఎలాగైనా తన తల్లిదండ్రులకు చిన్న కొడుకుపై ఉన్న ప్రేమను దూరం చేయాలని, దానికి అతనిని చంపడమే సరైన మార్గమని భావించాడు. అనుకున్నదే తడవుగా హత్యకు మంచి తరుణం కోసం వేచి చూశాడు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగా ఇంట్లో చిన్న గొడవ జరిగింది. అది కాస్తా పెద్దగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు దారి తీసింది. అప్పటికే చిన్న కొడుకుపై అసహనం పెంచుకున్న పెద్దవాడు వంటగదిలోని సుమారు 6 ఇంచుల పొడవైన పదునైన కత్తితో పొడిచాడు. అయితే.. ఈ హత్య వెనుక అసలు కారణాలపై పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదు. ఇంట్లో జరిగిన చిన్న గొడవకే తోడబుట్టినవాడిని చంపడం, అది కూడా మైనర్ బాలుడు కావడం, చంపుకునేంత కసి పెరగడం.. ఈ పరిణామాలన్నీ పలు అనుమానాలకు తావిచ్చాయి. మైనర్ బాలుడే ఆవేశంలో దాడి చేసి చంపాడా.. మరెవరైనా ఈ నేరానికి ప్రేరేపించారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ప్రతి అంశాన్ని లోతుగా విచారిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. హత్యకు పాల్పడిన పెద్ద కొడుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




