West Bengal: ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యే భార్యకు లాటరీలో కోటి రూపాయలు.. మనీ లాండరింగ్ అంటున్న బీజేపీ..?
పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే భార్య లాటరీలో కోటి రూపాయలు గెల్చుకోవడం రాజకీయ దుమారాన్ని రేపింది. ఇది కచ్చితంగా మనీ లాండరింగ్ అని బీజేపీ ఆరోపించింది. లాటరీ సంస్థలతో టీఎంసీకి..
ఇటీవల కాలంలో లాటరీ టిక్కెట్ల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారి గురించి వింటున్నాం. చాలా మంది లాటరీ టికెట్లు కొనడం ద్వారా కోటి రూపాయల నగదు గెలుచుకున్నారన్న వార్తలు చూస్తున్నాం. తాజాగా పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే భార్య లాటరీలో కోటి రూపాయలు గెల్చుకోవడం రాజకీయ దుమారాన్ని రేపింది. ఇది కచ్చితంగా మనీ లాండరింగ్ అని బీజేపీ ఆరోపించింది. లాటరీ సంస్థలతో టీఎంసీకి సంబంధాలు ఉన్నాయని తాము గతంలోనే చెప్పామని.. దీనికి అనేక ఆధారాలున్నాయంటూ బీజేపీ నేత, పశ్చిమబెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేంధు అధికారి ఆరోపించారు. కోల్కతా జిల్లాలోని జోరాసాంకో నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్య రుచికా గుప్తా వారంతపు లాటరీలో మొదటి బహుమతిగా రూ.1 కోటి గెలుచుకున్నారు. ఆగస్ట్ 31వ తేదీన జరిగిన డ్రాలో ఆమె ఈ నగదు బహుమతి గెలుపొందినట్లు ఒ వార్తా పత్రిక కథనం ప్రకారం తెలుస్తోంది. లాటరీ సంస్థ ప్రకటనను ట్విట్టర్లో షేర్ చేసిన బీజేపీ నేత సువేందు అధికారి లాటరీ కంపెనీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య సంబంధం ఉందని ఆరోపించారు.
గత కొంతకాలంగా తాను ఈ విషయం చెబుతూ వస్తున్నానని సువేంధు అధికారి చెప్పారు. ఈ విధానం మనీ లాండరింగ్కి సులభమైన మార్గం అని అధికారి ట్వీట్ చేశారు. సాధారణ ప్రజలు ఎంతోమంది లాటరీ టిక్కెట్లు కొంటారు కానీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం బంపర్ ప్రైజ్ గెలుచుకుంటున్నారని ఆరోపించారు. మొదట అనుబ్రతా మోండల్ లాటరీ లో నగదు గెలుచుకున్నారని, ప్రస్తుతం టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్య రూ.1 కోటి గెల్చుకున్నారని తెలిపారు. పశ్చిమబెంగాల్ లో చాలా మంది పేద ప్రజలు సులభంగా డబ్బు గెలుచుకోవాలనే ఆశతో ఈ లాటరీ టికెట్లకు ఆకర్షితులయ్యారని, కొంతమంది బానిసలుగా మారారని సువేందు అధికారి తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. పేద ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును లాటరీ టికెట్లు కొని పాడు చేసుకుంటున్నారని, అయితే టీఎంసీ నాయకులు పేద ప్రజల డబ్బులతో లబ్ధిపొందుతున్నారని ఆరోపించారు.
Off & on, I’ve been vocal about this alarming issue. The poor people of WB are being lured by the prospect of winning easy money & are becoming addicted. With easy access, they’re draining their hard earned money on such tickets & corrupt TMC leaders are gaining at their expense. pic.twitter.com/bLstiJPBJy
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) October 27, 2022
మరోవైపు తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి లాటరీలో గెలిచిన నగదు ఉపయోగిస్తానని టీఎంసీ ఎమ్మెల్యే భార్య రుచిక తెలిపారు. సువేందు అధికారి విమర్శలపై వివేక్ గుప్తా స్పందిస్తూ.. ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం “చాలా దురదృష్టకరం అని, అవమానకరం అని తెలిపారు. ఒక వేళ తన భార్య లాటరీ టికెట్ కొని నేరం చేస్తే.. లక్షలాది మంది ఇలాంటి నేరానికి పాల్పడ్డారని వికేక్ గుప్తా కౌంటర్ ఇచ్చారు. తన భార్య లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేసి మొదటి బహుమతిని గెలుచుకుందని, ఒక వేళ అది నేరంగా భావించి చర్య తీసుకోవాలని భావిస్తే లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసి బహుమతులు గెలుచుకున్న వారందరిపై తీసుకోవల్సి ఉంటుందన్నారు. తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి కాల్ వచ్చిందని, వారు తన ఇంటికి వస్తామని చెప్పారని, వారికి అధికారాలు ఉన్నందున తాము స్వాగతం పలుకుతున్నామని వివేక్ గుప్తా తెలిపారు. ప్రతి వారం ఎవరో ఒకరు లాటరీ బహుమతిని గెలుస్తారని, గెలుపొందిన వ్యక్తి ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధం కలిగి ఉండవచ్చని అందులో తప్పేముందని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. ఏదైనా చట్టవిరుద్ధం అయితే, దేశ వ్యాప్తంగా అటువంటి కార్యకలాపాలను నిషేధించాలని హితవుపలికారు.
గత ఏడాది డిసెంబర్ లో టీఎంసీ పార్టీ బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడు అనుబ్రత మోండోల్ రూ. 6 కి లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేయగా.. ఆయన లాటరీలో రూ.కోటి బహుమతిని గెలుచుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ సమయంలో ఆయన దానిపై స్పందించడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పశ్చిమ బెంగాల్లో పశువుల అక్రమ రవాణా కుంభకోణంలో ఆగస్టు 11వ తేదీన సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఓ ఎమ్మెల్యే భార్య రూ.కోటి రూపాయలు గెల్చుకోవడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందనేది వేచి చూడాల్సిన అంశం.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..