ఆ నాలుగు కారణాల వల్లే 99శాతం మందిలో గుండెపోటు..! భద్రం బీ కేర్ ఫుల్..
భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడితో కూడిన జీవనశైలి ప్రజల గుండె ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయి.. ప్రజలు తమ ఆహారం, జీవనశైలిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, రాబోయే సంవత్సరాల్లో గుండెపోటు రేట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నిశ్శబ్ద ముప్పును నివారించడానికి శరీర సంకేతాలను ముందుగానే గుర్తించడం, క్రమం తప్పకుండా హెల్త్ చెక్ప్లు చేయించుకోవడం చాలా ముఖ్యం. అయితే, మన దేశంలో గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

భారతదేశంలో అధిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణంగా మారుతున్నాయి. 2014- 2019 మధ్య దేశంలో గుండెపోటుల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, ఒత్తిడి, ధూమపానం, మధుమేహం వంటి వ్యాధులు ప్రధాన కారణాలు. ఈ సమస్య ఆరోగ్యానికే పరిమితం కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థ, కుటుంబ స్థిరత్వం, పని జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులకు నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
గుండెపోటు ఎందుకు వస్తుంది?
గుండెకు రక్త ప్రసరణ గడ్డకట్టడం లేదా గుండెకు దారితీసే ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. ఇది గుండె కండరానికి ఆక్సిజన్ చేరకుండా నిరోధిస్తుంది. దీనివల్ల కణాలు తక్కువ సమయంలోనే చనిపోతాయి. సకాలంలో చికిత్స అందకపోతే, అది ప్రాణాంతకం కావచ్చు. చాలా సార్లు గుండెపోటు, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు హఠాత్తుగా రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఊబకాయం, ధూమపానం వంటి కారణంగా గుండెపోటు సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
శరీరంలో దాగి ఉన్న నాలుగు ప్రధాన ప్రమాదాలు:
వైద్యుల అభిప్రాయం ప్రకారం, చాలా మందికి మొదటి సారిగా గుండెపోటు అకస్మాత్తుగా రాకపోవచ్చు.కానీ, దాని వెనుక కొన్ని నిశ్శబ్ద ప్రమాద కారకాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే..
అధిక రక్తపోటు – దీర్ఘకాలిక అధిక రక్తపోటు ధమనుల గోడలను దెబ్బతీస్తుంది.
కొలెస్ట్రాల్ – రక్తంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ధమనులలో కొవ్వు నిల్వలు ఏర్పడతాయి. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది.
రక్తంలో చక్కెర లేదా డయాబెటిస్ – పెరిగిన చక్కెర రక్త కణాలను బలహీనపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని అనేక రెట్లు పెంచుతుంది.
ధూమపానం – పొగాకు గుండె, ధమనులు రెండింటినీ దెబ్బతీస్తుంది.
ఈ కారకాలన్నీ క్రమంగా పనిచేస్తాయి. కానీ, ప్రమాదం ఇప్పటికే పెరిగినప్పుడు మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్లు చేయించుకోవడం చాలా అవసరం.
గుండెపోటు ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?
ఇక్కడ ఊరట కలిగించే విషయం ఏంటంటే… ఈ ప్రమాదాలలో చాలా వరకు నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, వైద్య పరీక్షలు గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దీని కోసం మీ ఆహారంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటివి చేర్చుకోవాలి. అదనంగా, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల వాకింగ్ లేదా యోగాతో చిన్న చిన్న వ్యాయామం చేయండి.
సాధ్యమైనంత వరకు ధూమపానం మానేయండి. పొగాకు మానేయడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం వెంటనే తగ్గుతుంది. చాలా స్ట్రోకులు, గుండెపోటులు ప్రజల నిర్లక్ష్యం కారణంగానే సంభవిస్తాయి. ఎందుకంటే చాలా వరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరు. సకాలంలో పరీక్షలు చేయించుకోవటం వల్ల వైద్యులు ప్రారంభ దశలోనే చికిత్స అందించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన వారు లేదా గుండె జబ్బుల కుటుంబ చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా కొన్ని రకాల హెల్త్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




